కన్హా శాంతివనం తెలంగాణకే తలమానికం

కన్హా శాంతివనం తెలంగాణకే తలమానికం

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా విరాజిల్లుతున్న కన్హా శాంతివనం తెలంగాణకే తలమానికమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజకవ ర్గం, నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామ శివారులో గల కన్హా శాంతివనాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్హాశాంతివన నిర్వాహకులు, పద్మభూషణ్ కమలేష్‌పాటిల్ (దాజీ)ని ప్రత్యేక అభినందించారు. 

కన్హా శాంతివనం రాష్ట్రంలో ఏర్పాటు కావడం మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి తెలిపారు. సుస్థిరత,అటవి పెంపకం, మహిళా సాధికారత, విద్యారంగాల్లో మనస్ఫూర్తిగా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రస్తుతించారు. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాలను మెరుగుపరుచుకోవాలని, సమాజహితం కోసం రెవా దాజీ దార్శనికత, నిశిత మార్గదర్శకత్వంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన కన్హాశాంతివనాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు.

కన్హా శాంతి వనం పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుండడం మనందరికీ ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి ప్రశంసించారు.  ప్రపంచ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు కన్హా శాంతి వనంలో దర్శనమిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రెయిన్ ఫారెస్ట్, ఫెసిలిటీ వ ద్ద ఉన్న టిష్యూ కల్చర్ ల్యాబ్‌ని ప్రత్యేకంగా పరిశీలించి గాలిబుడగ (హిల్డెగార్డియా పా పులిఫోరియా) మొక్కను సిఎం నాటారు. 

కన్హా శాంతివన నిర్వాహకులు రెవ దాజీ మా ట్లాడుతూ మానవుడి జీవితాన్ని హృదయపూర్వకంగా మెరుగుపరిచేందుకు ఎలాంటి స్వార్థం లేకుండా కృషి చేస్తున్న తమ సంస్థను సిఎం అభినందించడం మరిచిపోలేని అనుభూతిగా భావిస్తున్నామని చెప్పారు. భూమిపై స్వర్గాన్ని నిర్మించడమే తమ ముందున్న లక్ష్యమని చెబుతూఅందుకోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 

1945లో శాంతి, ఆనందం, జ్ఞానాన్ని తీసుకురావలన్న లక్ష్యంతో రామచంద్రమిషన్ ద్వారా బోధనగా లాంఛనప్రాయంగా మార్చామని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, షాద్‌నగర్ ఎంఎల్‌ఎ వీర్లపల్లి శంకర్, చేవెళ్ల ఎంఎల్ కాలె యాదయ్య, మాజీ ఎంపిపి శివశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.