అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(100) తుది శ్వాస విడిచారు. అమెరికాకు 39వ అధ్యక్షుడుగా వ్యవహరించిన జిమ్మీ కార్టర్, 2 నెలల క్రితమే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్, డిసెంబర్ 29న తుది శ్వాస విడిచారు. అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి, వందేళ్లు బతికిన తొలి వ్యక్తిగా నిలిచారు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం సొంతం చేసుకున్న జిమ్మీ కార్టర్, డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు.

అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్‌ ఈ.కార్టర్‌ 3 చెప్పారు. జిమ్మీ కార్టర్‌ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ సంతాపం తెలిపారు. ప్రపంచం “అసాధారణ నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని మరియు మానవతావాదిని” కోల్పోయిందని  తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారని బైడెన్‌ తెలిపారు. 

జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు అధికారిక ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు. మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలెట్టారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక రాజకీయాలవైపు అడుగులు వేశారు.

1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై గెలిచి, యూఎస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు జిమ్మీ కార్టర్. జిమ్మీ కార్టర్ భార్య రోసలెన్ స్మిత్, 2023లో 96 ఏళ్ల వయసులో మృతి చెందారు. జిమ్మీ కార్టర్‌, స్మిత్ దంపతులకు నలుగురు సంతానం. జిమ్మీ కార్టర్ కొడుకు జాక్ కార్టర్, యూఎస్‌లో బిజినెస్‌మ్యాన్‌గా ఉన్నారు.

1977 నుంచి 1981 వరకూ యూఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జిమ్మీ కార్టర్, జార్జియా గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జిమ్మి కార్టర్, మానవ హక్కుల పరిరక్షణతో పాటు పర్యావరణ సంక్షేమం కోసం కృషి చేశారు. 1978లో ఇజ్రాయిల్, ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో జిమ్మీ కార్టర్ కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది భారత్‌ పర్యటనకు కార్టర్‌ వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హరియాణాలోని ఓ గ్రామానికి కార్టర్‌పురిగా నామకరణం చేశారు.