జనవరి 1 నుంచి ఇండియన్‌ రైల్వే కొత్త టైమ్‌టేబుల్‌!

జనవరి 1 నుంచి ఇండియన్‌ రైల్వే కొత్త టైమ్‌టేబుల్‌!
కొత్త సంవత్సరంలో జనవరి 1 నుంచి నూతన టైమ్‌టేబుల్‌ను అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే విభాగం ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి కొత్త టైమ్‌ టేబుల్‌ను అమలు చేయనుంది. ‘ట్రెయిన్‌ ఎట్‌ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్‌కు సంబంధించిన ప్రస్తుత టైమ్‌టేబుల్‌ 2024 డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి కొత్త టైమ్‌టేబుల్‌ అమల్లోకి వస్తుంది.

2025 నాటికి మొత్తం 136 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, నమో భారత్‌ ర్యాపిడ్‌ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. నూతన రైల్వే టైమ్‌టేబుల్‌లో ఏముంటుంది? కొత్తగా ఎలాంటి మార్పులు వస్తాయి? తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా రైల్వే శాఖ ప్రతి ఏడాది జూన్‌ 30 లోపు ‘ట్రెయిన్‌ ఎట్‌ ఎ గ్లాన్స్’ వర్కింగ్‌ టైమ్‌ టేబుల్‌ను విడుదల చేస్తుంది. జూలై 1 నుంచి కొత్త టైమ్‌ టేబుల్‌ అమల్లోకి వస్తుంది. అయితే ఈ ఏడాది నిబంధనలను సవరించారు. జనవరి 1 నుంచి కొత్త టైమ్‌ టేబుల్‌ అమల్లోకి వచ్చేలా ప్లాన్‌ చేశారు. 

ఇదిలావుంటే మహా కుంభమేళా 2025కు సన్నాహకంగా ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఈ కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నది. దాదాపు 3 వేల ప్రత్యేక రైళ్లను నడపడంతోపాటు లక్ష మందికి పైగా ప్రయాణికులకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు మహాకుంభ్‌ గ్రామ్‌లో బస కోసం ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, టూరిజం డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌, మహాకుంభ్‌ యాప్‌లో అదనపు సమాచారం అందుబాటులో ఉండటంతో వాటి ద్వారా సులభంగా రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.