ఆఫ్ఘన్ పై పాక్‌ వైమానిక దాడులు.. 15 మంది మృతి

ఆఫ్ఘన్ పై పాక్‌ వైమానిక దాడులు.. 15 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌ పాక్టికా ప్రావిన్స్‌ బర్మల్‌ జిల్లాలో పాక్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పాక్‌ దాడులకు పాల్పడింది. ఏడు గ్రామాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపగా లామన్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.  మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్‌, ఆప్ఘన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
 
ఈ వైమానిక దాడిని పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ రహస్య స్థావరాలపై ఈ దాడి జరిగిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం సమాచారం. ఈ దాడి బర్మల్‌లోని ముర్గ్ బజార్ గ్రామంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది మానవతా సంక్షోభాన్ని మరింత పెంచింది.

ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారని, ఆ ప్రాంతంలో నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.  ఈ బాంబు పేలుళ్లకు పాకిస్తాన్‌ జెట్‌ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. 

పాక్‌ వైమానిక దాడులు తీవ్రమైన పౌర ప్రాణనష్టం, విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. దాడుల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు.. బర్మాల్‌, పక్టికాపై జరిగిన వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఆప్ఘన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాక్‌ వైమానిక దాడులను ఖండించింది. పాక్‌ లక్ష్యంగా దాడులు చేసిన వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. అయితే, తెహ్రీక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్‌ తాలిబాన్‌ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్‌ ఆరోపించింది. ఈ క్రమంలో దాడులకు చేసినట్లు తెలుస్తోంది.