రూ.22,280 కోట్ల విలువైన మాల్యా, చోక్సీ ఆస్తుల జప్తు

రూ.22,280 కోట్ల విలువైన మాల్యా, చోక్సీ ఆస్తుల జప్తు

బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. అయితే అక్కడి చట్టాలు వారికీ అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. దీనితో వారి ఆస్తులను వేలం ద్వారా ఆ నష్టాలను నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. 

ఇందులో భాగంగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి ఈ ఏడాది రూ.22 వేల కోట్లు రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి రూ.14 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు వివరించారు. 

అదేవిధంగా గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి, బ్యాంకు రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులు అమ్మి వెయ్యి కోట్లు వసూలు చేశామని ఆమె తెలిపారు.
మిగతా ఎగవేతదారుల నుంచి ఏడు వేల కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ.22,280 కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని చెప్పారు. ఇందుకోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని తెలిపారు.

మరో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ఈ ఆస్తులను కూడా వేలం వేసేందుకు స్పెషల్ కోర్టు అనుమతిచ్చిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న సుమారు రూ. 13 వేల కోట్లకు పైగా రుణాలను చోక్సీ చెల్లించలేదని తెలిపారు. 

దీంతో ఈడీ జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర రుణదాతలకు చెల్లించాలని ముంబై స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇక నీర‌వ్ మోదీ కేసులో 1,052.5 కోట్ల ఆస్తుల్ని బ్యాంకులు జ‌ప్తు చేసుకున్న‌ట్లు చెప్పారు. పీఎంఎల్ఏ చట్టం ఆధారంగా రుణాల ఎగవేతదారుల నుంచి సొమ్ము రాబడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

నేష‌న‌ల్ స్పాట్ ఎక్స్‌చేంజ్ స్కామ్‌లో 17.47 కోట్లు బ్యాంకులు సీజ్ చేశాయ‌న్నారు. ఎస్ఆర్ఎస్ గ్రూపుకు చెందిన 20.15 కోట్లు, రోజ్ వాలీ గ్రూపుకు చెందిన 19.40 కోట్లు, సూర్య ఫార్మ‌సీకి చెందిన 185.13 కోట్లు, నౌషేరా షేక్ గ్రూపుకు చెందిన 226 కోట్లు, నాయుడు అమృతేశ్ రెడ్డికి చెందిన 12.73 కోట్ల ప్రాప‌ర్టీల‌ను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.