11 నెలల్లో రూ.223 లక్షల కోట్ల యుపిఐ చెల్లింపులు

11 నెలల్లో రూ.223 లక్షల కోట్ల యుపిఐ చెల్లింపులు
యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ #డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోంది. 2024 జనవరి- నవంబర్ మధ్య 15,547 కోట్ల లావాదేవీల్లో రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇది భారత్ ఆర్థిక పరివర్తనపై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొంది. 
 
ప్రపంచవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.
ప్రస్తుతం ఏడు దేశాల్లో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది భారత్‌లో పెరిగిపోతున్న డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. 
 
మొబైల్ ఫోన్ల ద్వారా వ్యక్తులు, వ్యాపారుల మధ్య రియల్ టైం లావాదేవీల దిశగా డిజిటల్ చెల్లింపుల పరివర్తన సాగుతోంది. 2015లో ఆర్బీఐ మద్దతుతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రారంభించారు. యూఐడీఏఐ చైర్మన్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకని సారధ్యంలోని కమిటీ.. దేశంలో సమర్ధవంతమైన డిజిటల్ చెల్లింపుల ఫ్రేమ్ వర్క్ స్థాపించాలని ప్రతిపాదించింది. తదనుగుణంగా యూపీఐ ఏర్పాటు జరిగింది.