ఇక ప్రతి రైల్లో నాలుగు జనరల్‌ కోచ్​లు!

ఇక ప్రతి రైల్లో నాలుగు జనరల్‌ కోచ్​లు!

దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తోన్న రైళ్లకు కొత్త బోగీల ఏర్పాటుపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో జనరల్‌ కోచ్​ల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రెండే జనరల్‌ కోచ్‌లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు వెల్లడించింది. 

అవి కూడా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉండనున్నట్లు వివరించింది. ఈ మేరకు జోన్‌ పరిధిలోని 21 జతల రైళ్లకు అదనగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైళ్లలో పేదలు జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తారు. ఇప్పుడు ఈ కోచ్​ల రూపం మారుతోంది.

ఇన్ని సంవత్సరాలు రైళ్లలో పాతకాలం నాటి సాధారణ బోగీలే ఉన్నాయి. ఇప్పటికి అనేక రైళ్లలో రెండే కోచ్​లు ఉన్నాయి. దీంతో పేద ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలనుకున్న రైల్వేబోర్డు ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించింది. కొత్తగా వస్తున్న జనరల్‌ కోచ్​లను ఎల్‌హెచ్‌బీ పరిజ్ఞానంతో తయారుచేసినవి ప్రవేశపెడుతున్నారు. 

పాతతరం ఐసీఎఫ్‌ బోగీల్లో 90 సీట్లు ఉండేవి. ఇప్పుడు ఎల్‌హెచ్‌బీ కోచ్​ల్లో సీట్ల సంఖ్య 100. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు సైతం తక్కువ నష్టం ఉంటుంది. మరోవైపు ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వే శాఖ ప్రవేశపెడుతూ వచ్చింది. తాజాగా జనరల్‌ క్లాస్‌లోనూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. 

ఇప్పటికే జోన్‌ పరిధిలోని 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టారు. నారాయణాద్రి, దక్షిణ్, గౌతమి తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ జనరల్‌ బోగీలు వచ్చాయి. రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ బోగీలను దశలవారీగా జత చేస్తోందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 

ఫలితంగా రోజూ అదనంగా 70,000ల మంది ప్రయాణికులు జనరల్‌ బోగీల్లో ప్రయాణించేందుకు ఆస్కారం ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ పేర్కొన్నారు.