
తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రా యం కుదిరినట్టుగా తెలిసింది. మిగతా అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నిర్ణయించినట్టుగా సమాచారం. తెలంగాణ సిఎస్ శాంతికుమారి, ఎపి సిఎస్ నీరబ్ కుమార్ నేతృత్వంలో సోమవారం మంగళగిరిలోని ఎపిఐఐసీ ఆఫీస్లో జరిగిన అధికారుల కమిటీల భేటీ రెండుగంటలకు పైగా జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా 9, 10 షెడ్యూల్లోని ఆస్తుల పంపకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. దీంతోపాటు విద్యుత్ బకాయిల అంశాలకు సంబంధించి ఇరురాష్ట్రాల మధ్య పంచాయితీ తేలకపోవడంతో రెండు, మూడు సార్లు విద్యుత్ బకాయిలపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా సమాచారం.
ఇరు రాష్ట్రాలను ఇబ్బందులను పెడుతున్న డ్రగ్స్ నివారణపై జాయింట్ కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించినట్టుగా సమాచారం. అందులో భాగంగా పోలీస్, ఎక్సైజ్శాఖలతో ఈ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ఉద్యోగుల విభజనకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలిసింది.
దీంతోపాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి అదనంగా వసూలు చేసిన రూ.81 కోట్లను తిరిగి చెల్లించేందుకు కూడా ఎపి అంగీకారం తెలిపినట్టుగా సమాచారం. ఎపి, తెలంగాణల మధ్య రూ.861 కోట్ల లేబర్సెస్ పంపిణీకి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది. ముఖ్యంగా విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న 9,10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడిపై చర్చించినట్లుగా తెలిసింది. పంపకాలు కాకుండా మిగిలిపోయిన అంశాలపై వారు చర్చించినట్టుగా సమాచారం.
వృత్తి పన్ను పంపకం, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం. 9,10 షెడ్యూల్కు సంబంధించి ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపంకం కాకుండా మిగిలిపోయిన రూ.8 వేల కోట్ల అంశం కూడా చర్చించినట్టుగా తెలిసింది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ