సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు క్లీనింగ్‌ డ్యూటీ

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు క్లీనింగ్‌ డ్యూటీ

*మత దుష్ప్రవర్తనపై శిక్ష విధించిన అకల్ తఖ్త్

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, దివంగత ప్రకాష్ సింగ్ బాదల్ కుమారుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ప సిక్కుల అత్యున్నత సంస్థ అయిన అకాల్ తఖ్త్ కఠిన నిర్ణయం తీసుకుంది. డేరా బాబాకు మద్దతుగా ఉన్నందుకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. 

పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంతోపాటు పలు గురుద్వారాల్లో ఉండే కిచెన్, బాత్రూంలను శుభ్రం చేసే పనిని అప్పగించింది. అంతటితో ఆగకుండా  గుర్మీత్ రామ్ రహీమ్‌ను క్షమించిన బాదల్‌ తండ్రి, పంజాబ్ మాజీ సీఎం అయిన దివంగత ప్రకాష్ సింగ్ బాదల్, సమాజానికి చేసిన సేవలకు గాను 2011లో ఆయనకు ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) అన్న బిరుదును కూడా అకల్ తఖ్త్‌ తొలగించింది. సిక్కు సమాజానికి చేసిన సేవలకు గాను 2011లో ప్రకాష్ సింగ్ బాదల్‌కు ఫఖర్-ఎ-కౌమ్‌తో సత్కరించారు.

2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనుకూలంగా సుఖ్‌బీర్ బాదల్‌ వ్యవహరించారని అకాల్ తఖ్త్ తేల్చింది. అయితే తాను చేసిన అన్ని పనులకు సుఖ్‌బీర్ బాదల్‌ క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ మాత్రం కఠిన శిక్షను వేసింది.  ప్రస్తుతం వీల్‌చైర్‌లో ఉన్న సుఖ్‌బీర్ బాదల్‌, 2015లో పంజాబ్ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు, అకాలీదళ్ నేతలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోని  వంటగదిలోని పాత్రలు, టాయిలెట్లను శుభ్రం చేస్తారని అకాలీ తఖ్త్ వెల్లడించింది. ఆ తర్వాత స్నానం చేసి లంగర్ వడ్డిస్తారని తెలిపింది.

2007లో గుర్మీత్ రామ్ రహీమ్ సిక్కు గురువుల మాదిరిగానే దుస్తులు ధరించి ఒక వేడుకను నిర్వహించాడు. దీంతో అతడు అందుకుగాను అకల్ తఖ్త్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈ క్రమంలోనే తన ప్రభావాన్ని ఉపయోగించి డేరా చీఫ్‌కు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు క్షమాభిక్ష ప్రసాదించారని ఆరోపణలు రాగా . వాటిపై విచారణ జరిపి అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది.

 అకల్ తఖ్త్ జతేదార్ గియానీ రఘ్‌బీర్ సింగ్ సోమవారం అమృత్‌సర్‌లో పంజ్ పియారే (ఐదుగురు ప్రధాన సిక్కు పూజారులు) సమక్షంలో ఈ తీర్పును చదివి వినిపించారు. వీల్‌చైర్‌లో హాజరైన సుఖ్‌బీర్ సింగ్‌ బాదల్ ఈ తీర్పును అంగీకరించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేసిన రాజీనామాను ఆమోదించి, 6 నెలల్లోగా కొత్త చీఫ్‌ను నియమించాలని వర్కింగ్ కమిటీకి జాతేదార్ సూచించారు.

2015లో గురు గ్రంథ్ సాహిబ్ పట్ల దుష్ప్రవర్తనకు పాల్పడిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనుకూలంగా నాటి డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ బాదల్‌, ఆయన కేబినెట్‌ మంత్రులు, పార్టీ నేతలు వ్యవహరించడంపై సిక్కుల సర్వోన్నత మత కోర్టు అకాల్ తఖ్త్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాదల్‌తో సహా వారంతా మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ధారించింది. దీంతో బాదల్ తన తప్పులను అంగీకరించారు. ఆ కమిటీకి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వీలైనంత త్వరగా శిక్షను ప్రకటించాలని సిక్కుల సుప్రీంకోర్టుగా పిలిచే అకల్ తఖ్త్‌ను ఆయన కోరారు.