సయ్యద్‌ మోడీ టోర్నీ టైటిల్‌ గెల్చుకున్న సింధు

సయ్యద్‌ మోడీ టోర్నీ టైటిల్‌ గెల్చుకున్న సింధు

సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. ఆదివారం లక్నోలోని బాబు బనారసి దాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఫైన‌ల్స్ లో సింధు విజ‌యం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మళ్లీ  టోర్నీలో ఫైనల్లోకి టైటిల్ గెల్చుకొని తన సత్తాచాటింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు వరుస వరుస సెట్లలో విజయం విజ‌యం సాధించి చైనాకు చెందిన లుయో యు వును 21-14, 21-16 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది.

తెలుగమ్మాయి, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు రెండేండ్ల బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించింది. స్వదేశంలో జరిగిన సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఆమె టైటిల్‌ గెలిచింది.  ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో సింధు.. 21-14, 21-16తో వు లు యు (చైనా)పై గెలిచింది. 

తద్వారా ఆమె ఈ టోర్నీని మూడుసార్లు నెగ్గినైట్టెంది. 2017, 2022లోనూ ఆమె ఈ టోర్నీలో విజేతగా గెలిచింది. గతంలో సైనా నెహ్వాల్‌ మాత్రమే ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలవగా తాజాగా సింధు ఆమె రికార్డును సమం చేసింది. సింధూతో పాటు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్‌ ద్వయం టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 

పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో లక్ష్యసేన్‌.. 21-6, 21-7తో జియా హెంగ్‌ జేసన్‌ (సింగపూర్‌)పై అలవోక విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో త్రిసా-గాయత్రి జోడీ.. 21-18, 21-11తో బావో లి జింగ్‌-లీ కియూన్‌ (చైనా)ను చిత్తు చేసి తొలిసారి సూపర్‌ 300 టైటిల్‌ను కైవసం చేసుకుంది.

గత రెండేండ్లుగా బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ వేటలో ఉన్న సింధు.. ఈ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. ఇరా శర్మ, ఉన్నతి హుడా వంటి యువ భారత షట్లర్లు ఆమెకు కఠిన పోటీనిచ్చినా వారిని అధిగమిస్తూ ఫైనల్‌ చేరింది. తుదిపోరులో ఆమె.. తొలి గేమ్‌ బ్రేక్‌ సమయానికి 11-9తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఆమె జోరు పెంచి గేమ్‌ను సొంతం చేసుకుంది. 

కానీ రెండో గేమ్‌లో చైనా అమ్మాయి పుంజుకునేందుకు యత్నించింది. ఒకదశలో వు.. 11-10తో ఆధిక్యంలో ఉన్నా సింధు గేర్‌ మార్చింది. వు చేసిన తప్పిదాలను పసిగట్టిన ఆమె.. తనదైన స్మాష్‌లు, ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా పలు టోర్నీలలో సెమీస్‌కు చేరిన సింధు.. కీలక మ్యాచ్‌లలో విఫలమైనా ఈ టోర్నీలో మాత్రం ఆ తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంది.

ఇక పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో లక్ష్యసేన్‌ దుమ్మురేపాడు. సేన్‌ దూకుడుకు ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. మ్యాచ్‌ ఆద్యంతం అతడిదే ఆధిపత్యం. రెండు గేమ్స్‌లోనూ ప్రత్యర్థి 5 పాయింట్లు కూడా చేరకుండానే సేన్‌ విజయం దాదాపు ఖరారైంది.

పురుషుల, మహిళల సింగిల్స్‌, మహిళల డబుల్స్‌లో అదరగొట్టిన భారత్‌కు మిక్స్‌డ్‌ డబుల్స్‌తో పాటు పురుషుల డబుల్స్‌లో నిరాశ ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్‌ కపిల్‌ జంట.. 21-18, 14-21, 8-21తో డెచాపొల్‌-సుపిస్సర (థాయ్‌లాండ్‌) చేతిలో పరాభవం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి-సాయి ప్రతీక్‌ ద్వయం.. 14-21, 21-19, 17-21 తో హువాంగ్‌ డి – లియు యాంగ్‌ (చైనా) చేతిలో ఓడింది.

 అంతకు ముందు శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ సింధు 21-12, 21-9తో భారత్‌కే చెందిన ఉన్నతి హుడాపై అలవోక విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన అనుభవాన్నంత ఉపయోగిస్తూ డ్రాప్‌షాట్లు, నెట్‌గేమ్‌తో ఆకట్టుకుంది.

ఆ తర్వాత మాట్లాడుతూ ‘ ఈ రోజు నా ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నాను. ఆది నుంచే ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చాను. బేసిక్స్‌కు కట్టుబడి ఉంటూ మ్యాచ్‌ ఆడాను. మొత్తంగా ఈ విజయం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ప్లేయర్ల కెరీర్‌లో ఒడిదొడుకులు సహజం. వయసును బట్టి మనలో ఫిట్‌నెస్‌ స్థాయి మారుతూ ఉంటుంది. అందుకు తగ్గట్లు మార్పులు చేసుకోవాలి’ అని అంది.