అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం తన యంత్రంగాన్ని సిద్ధం చేసుకుంటున్న ట్రంప్ పలువురు భారత సంతతికి చెందిన అమెరికన్లను కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఇప్పటికే భారతీయ అమెరిన్లు వివేక రామస్వామి, జై భట్టాచార్య వంటివారికి ఉన్నత పదవులు దక్కాయి.
తాజాగా, మరో భారతీయుడికి కీలక పదవిని కట్టబెట్టారు. భారత సంతతి లాయర్ కశ్యప్ పటేల్ అలియాస్ కాష్ పటేల్ను దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎప్బీఐ) డైరెక్టర్గా నియమించనున్నట్లు ప్రకటించారు.
‘ఎఫ్బీఐ తదుపరి డైరెక్టర్గా కాష్ పటేల్ వ్యవహరిస్తునందుకు నేను గర్విస్తున్నా. కాష్ గొప్ప లాయర్, పరిశోధకుడు. దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్న అమెరికా ఫస్ట్ ఫైటర్. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పది. ఆయన నియామకంతో ఎఫ్బీఐకి పునర్వైభవం తీసుకొస్తాం’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫాంలో వెల్లడించారు.
ఇక, ట్రంప్నకు వీరవిధేయుడిగా క్యాష్కు గుర్తింపు ఉంది. భారత్లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతని తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. కాష్ తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు.
యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్శిటీ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక లా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు. పలు కీలక కేసులను వాదించిన కశ్యప్ కొన్నాళ్లు న్యాయశాఖలో చేరారు. ఆ సమయంలో ట్రంప్ను ఆకర్షించారు.
ట్రంప్నకు సన్నిహితుడైన రెప్.డెవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా 2019లో నియమితులయ్యారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారుగా, తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీ, ఫెడరల్ ప్రాసిక్యూటర్, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా పలు విధులు నిర్వహించారు.
నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఉగ్రవాదం) సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు. ఐఎస్, అల్ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన అల్ బగ్దాదీ, ఖాసెమ్ అల్ రిమి వంటి అగ్రనాయకత్వాన్ని నిర్మూలించడం, అనేక మంది బందీలను విడిపించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మిషన్లను కశ్యప్ అమలు చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు