
* ప్రధాని మోదీకి నైజీరీయా అత్యున్నత పురస్కారం
నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా పలు రంగాల్లో నైజీరియాతో సంబంధాలను పెంపొందించేందుకు భారత్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి భారత్, నైజీరియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి. నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ చర్చల తర్వాత ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్వసిస్తున్నాను” అని చెప్పారు.
దాదాపు 60,000 మంది ప్రవాస భారతీయులు భారత్- నైజీరియా సంబంధాలకు కీలక స్తంభంగా నిలుస్తున్నారని పేర్కొంటూ వారి సంక్షేమానికి భరోసా ఇచ్చినందుకు టినుబుకు ధన్యవాదాలు తెలిపారు. గత నెల(సెప్టెంబరు)లో బీభత్సం సృష్టించిన వరదల వల్ల నష్టపోయిన నైజీరియా ప్రజల కోసం భారత్ 20 టన్నుల సహాయ సామగ్రిని పంపుతుందని ప్రధాని ప్రకటించారు. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందడం ఒక కీలక పరిణామం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
కాగా, ప్రతినిధి స్థాయి చర్చలకు ముందు భారత ప్రధాని మోదీ, నైజీరియా అధ్యక్షుడు టినుబు ప్రెసిడెన్షియల్ పరస్పరం సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజెర్’ ను ప్రదానం చేసింది. ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్వో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి సింబాలిక్గా ‘అబుజా సిటీ కీ’ ని బహూకరించారు.
తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్’ ప్రకటించింది. ఈ అవార్డును అందుకున్న విదేశీయుల్లో మోదీ కంటే ముందు క్వీన్ ఎలిజబెత్ మాత్రమే ఉండటం విశేషం. దీంతో భారత ప్రధానికి విదేశాల నుంచి వచ్చిన పురస్కారాల సంఖ్య 17కు చేరింది.
2007 అక్టోబర్లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నైజీరియాలో పర్యటించారు. అప్పుడు ఆఫ్రికన్ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నైజీరియా ఆరు దశాబ్దాల క్రితం నుంచి భారత్కు మిత్ర దేశంగా ఉంది. దాదాపు 60,000 మంది ప్రవాస భారతీయులు నైజీరియాలో ఉన్నారు. అలాగే 200కు పైగా భారతీయ కంపెనీలు నైజీరియాలో పెట్టుబడులు పెట్టాయి.
నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఆదివారం నైజీరియాకు వెళ్లారు. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తర్వాత జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు. అక్కడ వివిధ సభ్య దేశాధినేతలతో భేటీ కానున్నారు. 18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్