మహారాష్ట్రలో 175 సీట్లలో అధికార కూటమిదే గెలుపు

మహారాష్ట్రలో 175 సీట్లలో అధికార కూటమిదే గెలుపు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ‘మహాయుతి’ కూటమి గెలుపు తథ్యమని, మూడు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమంతో రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాయని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భరోసా వ్యక్తం చేశారు. తమ కూటమి 175 సీట్లు గెలుచుకుంటుందని ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. బారామతి నియోజకవర్గం నుంచి తాను కనీసం లక్ష ఓట్ల అధిక్యంతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, మహారాష్ట్ర ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని అజిత్ పవార్‌ చెప్పారు. 1985 నుంచి మహారాష్ట్రలో ఓ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదని, ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదని చెప్పారు. నవాబ్ మాలిక్‌కు టిక్కెట్‌పై అడిగినప్పుడు, అది తన ఒక్కడి నిర్ణయం కాదని, కూటమి కలిసికట్టుగా టిక్కెట్లు ఇచ్చిందని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో 400 ప్లస్ సీట్లపై తాము ఇచ్చిన నినాదం గురించి ‘మహా వికాస్ అఘాడి’ తప్పుడు ప్రచారం చేసిందని అజిత్‌ పవార్‌ ఆరోపించారు. అదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్‌లను ఆపేస్తారని, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారని అంటూ ప్రతిపక్ష కూటమి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసిందని విమర్శించారు. అలాంటివేవీ ఈ దేశంలో జరిగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

పవార్ కుటుంబంలో చిచ్చుపై మాట్లాడుతూ ప్రభుత్వంలోకి వెళ్తామని ఎన్నోసార్లు శరద్ పవార్‌తో తమ ఎమ్మెల్యేలు చెప్పారని, ఆ సమయంలో ఆయన తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకున్నారని చెప్పారు. శరద్ పవార్ మనసులో ఏముందో ఎవరూ చెప్పలేరని, చివరకు సుప్రియా సూలే కూడా చెప్పలేరని పేర్కొన్నారు. 

తాను వంచకుడిని కాదని, తాను పార్టీలోనే ఉన్నానని, పార్టీ గుర్తు కూడా తనతోనే ఉందని అజిత్ పవర్ గుర్తు చేశారు. అసెంబ్లీ స్పీకర్ తమకు గుర్తు కేటాయించారని, ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టు ముందు ఉందని అజిత్ పవార్ తెలిపారు.