ఆమెను రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ ప్రభుత్వ అదృష్టం

ఆమెను రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ ప్రభుత్వ అదృష్టం

* ప్ర‌ధాని మోదీ ప్ర‌యాణించే విమానంలో సాంకేతిక లోపం

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ  అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. మొదట్లో ఆ పదవికి ముర్ము పేరును ప్రతిపాదించగానే ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు.
బ్రిటీష్‌ వలసవాదంపై తిరుగుబాటు చేసిన భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బీహార్‌లో జమూయిలో ‘జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణెంను, పోస్టల్‌ స్టాంప్‌ను ఆవిష్కరించారు.

పీఎం జన్‌మన్‌ యోజన పథకం ద్వారా పనులను ప్రారంభించిన ఘనత ద్రౌపది ముర్ముదేనని ఆయన కొనియాడారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు ఈ పథకం ద్వారా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, వారి అభివృద్ధికి కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు. సమాజానికి దూరంగా నివసిస్తున్న ఆదివాసీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

ఆదివాసీలు పండించే దాదాపు 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చామని చెప్పారు. ఆదివాసీ యువత క్రీడల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహించడానికి అనేక క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఆదీవాసీలకు చదువు, సంపద, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని వివరించారు.

ఆదివాసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని, బడ్జెట్‌ను రూ.25 వేల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని ప్రధాని తెలియజేశారు. కాగా, సుమారు 6,640 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు గిరిజన వర్గాల అభివృద్ధికి, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు తోడ్పడనున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాలతోపాటు జన్‌జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌ నిర్మించిన 11 వేల గృహ ప్రవేశాల కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌యాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం ప్ర‌ధాని జార్ఖండ్ వెళ్లారు. దేవ‌ఘ‌ర్‌లో ఆయ‌న విమానానికి సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చింది. 

సాంకేతిక స‌మ‌స్య‌ను ఫిక్స్ చేసే వ‌ర‌కు ఆ విమానం అక్క‌డే ఉండ‌నున్న‌ది. దీంతో ఢిల్లీలో వెళ్లాల్సిన ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న మ‌రింత ఆల‌స్యం కానున్న‌ది. ఇవాళ జార్ఖండ్‌లో ప్ర‌ధాని మోదీ రెండు చోట్ల బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు. బిర్సా ముండా జ‌యంతి ఉత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. జ‌న్‌జాతీయ గౌర‌వ్ దివ‌స్‌గా ఈ రోజును జరుపుకున్నారు.