పంట భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వడం దారుణం

పంట భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వడం దారుణం

పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్ద నుంచి బెదిరించి తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతుల నుంచి భూములను వేరు చేయడం అంటే తల్లిని బిడ్డను వేరు చేయడం వంటిదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కంచే చేను మేసిన చందంగా ప్రజల భూములు లాక్కుని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొడంగల్‌లో భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎటువంటి అర్హతలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు లగచర్లకు వెళ్తే అహ్వానం పలికిన పోలీసులు బిజెపి ఎంపీ డీకే అరుణ వెళితే అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దందాల కోసమే హైడ్రాను సృష్టించారని, ప్రజల భూములు, ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు ఒప్పుకోకపోయినా అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటెల తెలిపారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి 1500 పోలీసు బలగాలను మోహరించి గ్రామాల మీదపడి ప్రజలను అరెస్టులు చేశారని విమర్సించారు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగిన పాపానికి కొట్టారని మండిపడ్డారు. 

ఇంటర్నెట్‌ను బంద్ చేసి అరెస్టులు చేశారని, ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి చూపిస్తున్న నిజస్వరూపమే ఇది అని దయ్యబట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భూములు ఉన్నవారు తమ భూమి విలువ రూ.20 కోట్లు నుంచి రూ.30 కోట్లకు పెరిగిందని సంతోష పడుతుంటే భూములు కోల్పోయిన వారు మాత్రం అదే ఎయిర్ పోర్టులో టాయిలెట్లు క్లీనింగ్ చేసుకునే దుస్థితి నెలకొందని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. 

భూములు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊడ్చే ఉద్యోగాలు, తూడ్చే ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్‌లో పోలేపల్లె సెజ్ విషయంలో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. గతంలో వైఎస్సార్, నిన్నటి వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వాలలో ఏం జరిగిందో చూశామని తెలిపారు. 

ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా శిక్ష తప్పదని ఈటెల హెచ్చరించారు. గత ప్రభుత్వంలో భూసేకరణకు వస్తే తన్నితరమండని దుర్మార్గంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తాము వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.