కంగనా `ఎమర్జెన్సీ’ విడుదలకు కెనడా పరిణామాల అడ్డు!

కంగనా `ఎమర్జెన్సీ’ విడుదలకు కెనడా పరిణామాల అడ్డు!
బాలీవుడ్ అగ్ర న‌టి, బిజెపి ఎంపీ కంగ‌నా రనౌత్ కాస్త విరామం త‌ర్వాత స్వ‌యంగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి నిర్మించిన చిత్రం ఎమ‌ర్జెన్సీ. అయితే దీని విడుదలకు తొలి నుండి ఏవోకొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. 1975 నుంచి 1977ల మ‌ధ్య‌లో ఇందిరాగాందీ ప్ర‌భుత్వం అధికారంలో జ‌రిగిన ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
 
కంగ‌నా ఈ సినిమాలో ఇందిరాగాంధీగా న‌టించ‌గా అనుప‌మ్ ఖేర్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్‌గా, శ్రేయాస్ త‌ల్ప‌డే వాజ‌పేయి పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లోనే థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉంది. కానీ సెన్సార్ వివాదాలతో ఇప్పటికి విడుదల కాలేకపోయింది. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ నుండి కాస్త రిలీఫ్ వచ్చింది అనుకున్న సమయంలోనే మరో సమస్య ఎదురుపడింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది.

ఎట్టకేలకు సెన్సార్ కష్ఠాల నుండి బయటపడిన ఈ సినిమాకి కెనడాలో జరుగుతున్న ఖలిస్తాన్ ఉద్యమం ప్రభావం పడింది. ఖలిస్తాన్ ఉద్యమం నేపథ్యంలో భారత్‌కి కెనడాకి మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక ఇందిరాగాంధీ హత్యలో సిక్కుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సున్నితమైన సమయాల్లో ఈ సినిమాని ఇప్పుడే విడుదల చేయకపోవడం బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇక సెన్సార్‌ పరంగా ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ముంబై హైకోర్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ ఆదేశించింది. దీంతో ఈ సినిమా విడుదలకు ఇంకా చిక్కులు తొలగలేదని భావిస్తున్నారు. చిత్రంలో తమని తక్కువగా చూపించారని,  విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్‌ న్యాయస్థ్థానాన్ని సంప్రదించింది. 

దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదళ్‌ పార్టీ కూడా సెన్సార్‌ బోర్డును కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాలను పెంపొందింపజేేసలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది. 

ఈ క్రమంలోనే కంగన, చిత్ర నిర్మాణసంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ముంబై హైకోర్టును సంప్రదించారు. సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలకు విరుద్థంగా తాము ఆదేశాలని ఇవ్వలేమని తెలిపింది. ఈ క్రమంలోనే విచారణ అనంతరం వారం రోజుల్లోగా ఒక నిర్ణయానికి రావాలని సెన్సార్‌ బోర్డుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.