జర్నలిస్టుల రక్షణ కోసం ఓ చట్టం తీసుకు రావాలి

జర్నలిస్టుల రక్షణ కోసం ఓ చట్టం తీసుకు రావాలి
దేశంలో జర్నలిస్టుల భద్రత, రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు, తప్పుడు నిర్బంధాలు, బెదిరింపులపై ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు గుర్బీర్‌సింగ్‌ రూపొందించిన నివేదికను పిసిఐ ఆమోదించింది. కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్‌ ప్రకాశ్‌ దేశారు నుంచి ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ నివేదికకు సమర్ధన లభించటం గమనార్హం. 
 
ఈ నివేదిక కేంద్రానికి ప్రధానంగా మూడు ప్రతిపాదనలను చేసింది. అందులో మొదటిది దేశంలో జర్నలిస్టుల రక్షణ, భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటించటం. అలాగే, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌కు మరిన్ని అధికారాలు కలిగించాలనీ, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించాలని, చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది. 
 
గతేడాది భారత్‌లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారని, 226 మంది కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, రాజకీయేతర, సంఘ విద్రోహ శక్తులు, నేరస్థులకు లక్ష్యంగా మారారని అందులో వివరించింది. ఈమేరకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినమైన మే 3న విడుదలైన ఇండియా ప్రెస్‌ ఫ్రీడమ్‌ వార్షిక నివేదికను ఇది ఉటంకించింది.