కేటీఆర్, బండి సంజయ్ లీగల్ వార్

కేటీఆర్, బండి సంజయ్ లీగల్ వార్

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తనకు పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. చేసిన నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

బండి సంజయ్ వాఖ్యలు నిరాధారమైనని, తనపై తప్పుడు ఆరోపణలని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశతంతోనే ఆయన వాఖ్యలు చేశారని నోటీసులో కేటీఆర్ తెలిపారు.  ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అసత్య ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టుగా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు.

అయితే, కేటీఆర్‌ లీగల్‌ నోటీసుపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని అంటూ తిప్పికొట్టారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని పేర్కొన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్ అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు.

“కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. ఇక.. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతాం.” అంటూ బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.