ప్రాణభయంతో ఇరాన్‌ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌

ప్రాణభయంతో ఇరాన్‌ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌
లెబనాన్‌ పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా సహా పలువురు కీలక నేతలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న నయీమ్‌ ఖాసిమ్‌ ప్రాణ భయంతో లెబనాన్‌ను వీడినట్లు తెలిసింది. ఆయన ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

నయీమ్‌ అక్టోబర్‌ 5నే బీరుట్‌ను వీడినట్లు ఇరాన్‌ వర్గాలను ఊటంకిస్తూ యూఏఈకి చెందిన ఎరెమ్‌ న్యూస్‌ నివేదించింది. లెబనాన్, సిరియా పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరగచి విమానంలోనే ఆయన బీరుట్ నుంచి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ ఆయనను హత్య చేసే అవకాశం ఉందన్న ఇస్లామిక్ రిపబ్లిక్ నేతల హెచ్చరికలతోనే నయీమ్‌ లెబనాన్‌ను వీడినట్లు పేర్కొంది.

కాగా సెప్టెంబర్‌ 27న ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతమైన విషయం తెలిసిందే. నస్రల్లా మృతి తర్వాత నయీమ్‌ ఖాసిమ్‌ మూడుసార్లు ప్రసంగించారు. అందులో ఒకటి బీరుట్‌ నుంచి కాగా, మిగతా రెండు టెహ్రాన్‌ నుంచి మాట్లాడారు. నజ్రాల్లా మరణం తర్వాత ఇజ్రాయెల్‌కు నయీమ్‌ టార్గెట్‌గా ఉన్నాడు. దీంతో ఆయన ప్రాణ భయంతో లెబనాన్‌ను వీడినట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి.

మిలిటెంట్‌ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో నయీమ్‌ ఖాసిమ్‌ ఒకరు. ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుందన్న భయంతో నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వేళ.. సభలు, ఇంటర్వ్యూలతోపాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నజ్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా చీఫ్‌ బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు సమాచారం.