అమెరికా ఆరోపించిన వికాస్ యాదవ్ గతంలో ఢిల్లీలో అరెస్టు!

అమెరికా ఆరోపించిన వికాస్ యాదవ్ గతంలో ఢిల్లీలో అరెస్టు!
సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు భారత్ కు చెందిన `రా’ మాజీ అధికారి వికాస్ యాదవ్ కుట్ర చేశారంటూ అమెరికా మోపిన అభియోగాలను భారత్ ఖండించింది. పైగా, వికాస్‌ యాదవ్‌ను గత డిసెంబర్ లో డిల్లీ పోలీసులు దోపిడీ కేసులో = అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వికాస్ పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ నోటీసులు జారీ చేసింది. 
 
అయితే దోపిడీ కేసుకు సంబంధించి గతేడాదిలో అరెస్టయిన వికాస్‌ యాదవ్‌ 7నెలల తర్వాత ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదలైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  అయితే, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్‌ దీనిపై విచారణ జరిపేందుకు స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది. 
 
ఈ అభియోగాల్లో పేర్కొన్న భారత అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని న్యూదిల్లీ తమకు వెల్లడించినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ఈ బృందం పర్యటన ముగిసిన తర్వాతే వికాస్‌ యాదవ్‌పై అగ్రరాజ్యం అభియోగాలు చేయడం గమనార్హం.
 
వికాస్‌ యాదవ్.. గతంలో భారత ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. భారత విదేశీ ఇంటిలెజెన్స్‌ విభాగం, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్‌ సెక్రటేరియట్‌లోనూ ఆయన విధులు నిర్వర్తించారు. దీనిపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – ఎఫ్‌బీఐ విచారణ కూడా చేస్తోంది. దర్యాప్తులో భాగంగా వికాస్ యాదవ్‌పై ఎఫ్‌బీఐ పరారీలో ఉన్న నిందితుల జాబితాలో కూడా చేర్చింది.