అద్వానీ, రాజనాథ్, యోగిలకు ఎన్‌ఎస్‌జి కమాండోల ఉపసంహరణ

అద్వానీ, రాజనాథ్, యోగిలకు ఎన్‌ఎస్‌జి కమాండోల ఉపసంహరణ

* చంద్రబాబు, మాయావతిలకు కూడా

విఐపి భద్రతా విధుల నుంచి ఎన్‌ఎస్‌జి కమాండోలను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌ఎస్‌జి కమాండోల స్థానంలో సిఆర్‌పిఎఫ్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వచ్చే నెల లోగా ఈ బాధ్యతల మార్పిడి పూర్తి కావాలని కేంద్రం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తొమ్మిది మంది జడ్-ప్లస్ కేటగిరి వీఐపీలకు ఇస్తున్న ఎన్ఎస్‌జీ భద్రతను ఇక నుంచి సీఆర్‌పీఎఫ్ కల్పించనుంది.

కేంద్రం వీఐపీసెక్యూరిటీ విధుల నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ కమండో ఫోర్స్‌గా ఉన్న ఎన్ఎస్‌జీనీ దశలవారీగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఎన్‌ఎస్‌జీ స్థానంలో వీఐపీల సెక్యూరిటీ బాధ్యతల్ని సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించనుంది కేంద్రం. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ విభాగంలో వీఐపీ భద్రతా అవసరాల కోసం ఆరు బెటాలియన్లు అందుబాటులో ఉండగా..వాటిని ఇప్పుడు ఏడుకు పెంచనున్నారు.

ఇటీవలే పార్లమెంట్ భద్రతా బాధ్యతల నుంచి ఉపసంహరించిన ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని సిఆర్‌పిఎఫ్ విఐపి విభాగానికి కేంద్ర హోం శాఖ జతచేసిందని వారు చెప్పారు.  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

వీరితో పాటు కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, బిజెపి నాయకుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాకు కూడా విఐపి జెడ్ ప్లస్ క్యాటగిరి కింద ఎన్‌ఎస్‌జికి చెందిన బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత లభిస్తోంది. ఇక నుంచి ఈ విఐపిలకు సిఆర్‌పిఎఫ్ ఆధ్వర్యంలో భద్రత కల్పిస్తారు.

2003 అక్టోబరులో చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో జరిగిన నక్సల్‌ దాడి తర్వాత కేంద్రం ఆయనకు ఎన్‌ఎస్‌జీ కమాండోలతో భద్రతను కల్పిస్తోంది. గత 21 ఏళ్లుగా ఆయనకు ఎన్‌ఎస్‌జీ రక్షణగా ఉంది.. ఆ స్థానంలో ఇప్పుడు సీఆర్‌పీఎఫ్ బాధ్యతలు తీసుకోబోతోంది. ఇప్పటికే మంత్రి లోకేష్‌కు సీఆర్‌పీఎఫ్ బలగాలు సెక్యూరిటీని అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్‌ఎస్‌జీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని బ్లాక్‌ క్యాట్స్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో ఎన్‌ఎస్‌జీ గార్డ్స్‌ ధైర్యం, తెగువ, స్ఫూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్పారు.