నైజీరియాలో జిగావా రాష్ట్రం మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెట్రోల్ ట్యాంకర్ హైవేపై బోల్తాపడి పేలడంతో 100 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కనో నుంచి బయలుదేరిన ఈ ట్యాంకర్ డ్రైవర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. స్థానికులు కొందరు పెట్రోల్ కోసం ఎగబడ్డారు. పెట్రోలును తీసుకుంటున్న సమయంలో మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే 97 మంది మంటల్లో బూడిదైపోయారు.
ట్యాంకర్కు దూరంగా ఉండాలని హెచ్చరించినా ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడడం వల్లనే మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెప్పారు. మరో ఎనిమిది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారని జిగావా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధినేత డాక్టర్ హరుణ మరిగ తెలిపారు. బుధవారం మజియా పట్టణం లోని స్థానికులు మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేస్తున్నప్పుడు స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడకు వచ్చారు. అప్పటికే ప్రమాదంలో చాలా మంది బూడిదైపోయారని ఎమర్జెన్సీ సర్వీస్ అధినేత మరిగియా తెలిపారు. ఈ ప్రమాద ట్యాంకర్ డ్రైవర్ పొరుగునున్న కనో స్టేట్ నుంచి 110 కిమీ దూరం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్లు చెప్పారు.
నైజీరియాలో ప్రాణాంతక ట్యాంకర్ సంఘటనలు సర్వసాధారణం. నైజీరియాలో ఇంధనం ధరలు చాలా ఎక్కువ. గత ఏడాది నుంచి పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఏదైనా ట్యాంకర్ బోల్తా పడితే పెట్రోల్ కాజేయడానికి మూకుమ్మడిగా వస్తుంటారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 48 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ పేర్కొంది.
వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం . 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు.

More Stories
సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ