తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో క్యాట్ ను ఆశ్రయించిన సదరు ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్లు ఆమ్రపాలి, వాణిప్రసాద్, వాకాటి కరుణ, సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పిటిషన్లపై మంగళవారం క్యాట్ విచారణ జరిపింది.
డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. డీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీనిపై విచారించిన క్యాట్ ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వన్మెన్ కమిటీని డీవోపీటీ వేసినప్పుడు ఎందుకు స్పందించలేని.. అసలు నివాసానికి అర్థం ఏంటో చెప్పాలని.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదంటూ ప్రశ్నిస్తూ.. ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
బుధవారం యధావిథిగా ఐఏఎస్ అధికారులంతా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్ అధికారుల పిటిషణ్పై క్యాట్లో సీరియస్గా వాదనలు జరిగాయి. డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అధికారుల తరఫున న్యాయవాదులు గట్టిగా వాదించారు. ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి సేవ చేయాలని మీకు లేదా? అంటూ ఐఏఎస్ అధికారులను క్యాట్ సూటిగా ప్రశ్నించారు. ఐఏఎస్ల కేటాయింపులపై డీవోపీటీకీ పూర్తి అధికారాలున్నాయంటూ స్పష్టం చేసింది ధర్మాసనం.
స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్లైన్స్లో ఉందా? అని క్యాట్ ప్రశ్నించింది. అయితే, ఏకసభ్యకమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదంటూ ఐఏఎస్ తరఫున న్యాయవాదులు వాదించారు. దీంతో ఆ కమిటీ ఏర్పాటుపై వివరాలు అడిగింది క్యాట్. అదే సమయంలో 1986 బ్యాచ్ అధికారులతో స్వాపింగ్ ఎలా చేసుకుంటారంటూ ప్రశ్నించింది. ఇలా.. క్యాట్లో వాడి వేడి వాదనలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ తమ క్యాడర్ కేటాయింపుల ప్రకారం ఏపీ, తెలంగాణకు కేటాయించారు.
అయితే, ఇప్పుడు ఆ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లబోమంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఆ రాష్ట్రానికి వెళ్లాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిలీవింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామంటూ.. కాట ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, గుమ్మడి సృజన, రొనాల్డ్ రోస్ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు.

More Stories
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం
మంత్రి కొండా సురేఖపై నాగార్జున కేసు ఉపసంహరణ
10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కట్టేందుకు కిషన్ రెడ్డి చొరవ