
శబరిమల అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త తెలిపారు. అయ్యప్ప దర్శనం ఇక నుంచి 17 గంటల పాటు కల్పిస్తున్నామని వెల్లడించారు. భక్తులకు దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
మండలం మకరవిళక్కు సీజన్ను పురస్కరించుకొని ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తర్వాత రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి.. మళ్లీ డిసెంబరు 30 నుంచి మకరు విలక్కు పూజల కోసం తెరుస్తారు.
జనవరి 14న మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనం.. జనవరి 20న పడిపూజతో మకరు విలక్కు సీజన్ ముగియనుంది. ప్రతి రోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శబరిమలకు వచ్చే భక్తులకు ఆన్లైన్ బుకింగ్ను కేరళ సర్కార్ తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్పాట్ బుకింగ్ ఉండబోవని పేర్కొంది. కేవలం వర్చువల్ క్యూ మాత్రమే అమలు చేసి, ఆన్ లైన్ బుకింగ్స్ చేసే వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్ను అందించాలని నిర్ణయించారు.
దీనిపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఏ భక్తుడూ స్వామిని దర్శించుకోకుండా తిరిగి వెళ్లరాదనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ‘స్పాట్ బుకింగ్ కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే. వర్చువల్ క్యూ బుకింగ్ అనేది భక్తులకు ప్రామాణికమైన పత్రం. స్పాట్ బుకింగ్స్ పెరగడం మంచిది కాదు. స్పాట్ బుకింగ్ ఉంటే ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేస్తారా? భక్తుల భద్రతతో పాటు ఆలయ భద్రత కూడా బోర్డుకు ముఖ్యం’ అని చెప్పారు.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం