నీట్‌ పేపర్‌ లీకేజ్​లో 144 మందికి ప్రశ్నాపత్రం

నీట్‌ పేపర్‌ లీకేజ్​లో 144 మందికి ప్రశ్నాపత్రం

నీట్‌ యూజీ 2024 పేపర్‌ లీక్‌ కేస్​ దేశవ్యాప్తంగా తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసును దర్యాప్తులో భాగంగా సీబీఐ కీలక విషయాలను గుర్తించింది. ఈ వ్యవహారంలో పరీక్ష​కు కొన్ని గంటల ముందు మొత్తంగా 144 మంది అభ్యర్థులు ప్రశ్నాపత్రాన్ని అందుకున్నారని సీబీఐ గుర్తించింది. వీరంతా ల్రీకేజీ సూత్రధారులకు డబ్బులు చెల్లించినట్లు పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ గత వారం మూడో ఛార్జ్‌ షీట్​ను దాఖలు చేసింది. పరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందు పంకజ్‌ కుమార్‌ అనే వ్యక్తి చేతుల మీదుగా నీట్‌ ప్రశ్నాపత్రం లీకైనట్లు సీబీఐ గుర్తించింది. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ నుంచి ఈ ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయి. ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ సహకారంతోనే పేపర్‌ బయటకు వచ్చినట్లు ఛార్జి షీట్‌లో సీబీఐ వెల్లడించింది.

నీట్‌ పరీక్ష జరిగిన రోజు మే 5న ఉదయం 8 గంటలకు ప్రశ్నా పత్రాలు పాఠశాలకు వచ్చాయి. ఆ సమయంలో పరీక్షా కేంద్రానికి కోఆర్డినేటర్‌గా ఉన్న హసనుల్‌ హక్‌, ఐఐటీ జెంషడ్‌పుర్‌కు చెందిన ఓ సివిల్‌ ఇంజినీర్‌ను ప్రశ్నాపత్రం బాక్స్​ ఉన్న గదికి పంపించాడు. ప్రత్యేకమైన టూల్‌కిట్‌ సాయంతో అతడు ఆ పెట్టెను తెరిచాడు. ప్రశ్నా పత్రం మొత్తాన్ని ఫొటో తీసుకున్నాడు. అనంతరం దాన్ని యథావిధిగా పెట్టెలో పెట్టేసి సీల్‌ చేశాడు.

అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి క్వశ్చన్‌ పేపర్‌ను ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్న మరో వ్యక్తికి షేర్ చేశాడు. అక్కడే ఉన్న తొమ్మిది మంది వైద్య విద్యార్థులు కూడా ప్రశ్నాపత్రానికి సమాధానాలు పూర్తి చేశారు. వాటిని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ గ్యాంగ్‌ సభ్యులకు పంపించుకున్నారు.  డబ్బులు చెల్లించిన అభ్యర్థులకు ఆ ప్రశ్నా పత్రాలను చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. కాగా, ఈ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి 298 మంది సాక్షులు, 290 డాక్యుమెంట్లు, 45 మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా 5500 పేజీల ఛార్జ్‌ షీట్‌ను సీబీఐ రూపొందించింది.