హైడ్రాకు గవర్నర్ ఆమోదంతో చట్టబద్ధత

హైడ్రాకు గవర్నర్ ఆమోదంతో చట్టబద్ధత
హైద‌రాబాద్ విపత్తు స్పంద‌న‌, ఆస్తుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప‌రిర‌క్ష‌ణ ఏజెన్సీ (హైడ్రా)కు విస్తృత అధికారాలు క‌ల్పిస్తూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం రాజ్‌భ‌వ‌న్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఇక‌పై హైడ్రా చేప‌ట్ట‌బోయే అన్ని కార్య‌క‌లాపాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భించింది. 
 
ఈ చ‌ట్టాన్ని రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  జీహెచ్ఎంసీ చ‌ట్టంలో కొత్త‌గా 374(బీ) సెక్ష‌న్‌ను చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ అయింది. జ‌లాశ‌యాలు, రోడ్లు, పార్కులు, ఇత‌ర ఆస్తులు కాపాడే బాధ్య‌త అప్ప‌గించారు. అధికారి లేదా ఏజెన్సీకి అప్ప‌గించే అధికారం ప్ర‌భుత్వానికి క‌ల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది.
 
అంతవరకు ఈ ఆర్డినెన్స్ హైడ్రాకు దన్నుగా ఉండనున్నది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు.  అంతకుముందు హైడ్రా ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారు. 
 
దీంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైడ్రా ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు. జులై 19వ తేదీన ఈ హైడ్రాను జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పాటు చేశారు. ఈ జీవో నెంబర్ 99 ప్రకారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో పరిధిలో  ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చింది ప్రభుత్వం. 
ఆ తర్వాత హైడ్రాకు క్రమంగా అధికారాలను పెంచుకుంటూ వచ్చింది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలతో పాటు సిబ్బందిని కూడా అదే స్థాయిలో నియమించాలని నిర్ణయించింది. ఈమేరకు 169 మంది అధికారులను నియమించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే హైడ్రా చేపట్టిన కూల్చివేతల నేపథ్యంలో చాలా మంది బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు.  హైడ్రాకు ఉన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ధర్మాసనం ప్రశ్నించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే హైడ్రాకు ఆర్డినెన్స్‌కు గవర్నర్ కూడా ఆమోదించటంతో ఇకపై హైడ్రా మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.