హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం

హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం

ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే వారి సౌలభ్యం కోసం మరో రైలును రైల్వేశాఖ ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలును ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ఆదివారం ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

ఈ ట్రైన్ 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ వెళ్లే మార్గం ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ వెళ్తుంది.  సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది.

వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ నెల 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ కు అనుమతించినట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు గోవా (వాస్కోడిగామా) చేరుకుంటుంది. ఏటా సుమారు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా, ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండటం విశేషం.  నేరుగా రైళ్లలో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలను, ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడికి చేరుకుంటున్నారు.

ప్రస్తుతం వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గుంతకల్ చేరుకుని, అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు ప్రయాణం సాగిస్తోంది. అయితే, ఈ రైలులో టికెట్లు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో కొత్త రైలు పర్యాటకుల ప్రయాణ అవకాశాల్ని పెంచనుంది. అదనంగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. పైగా, ఇక మధ్యలో దిగే పనిలేకుండా, నేరుగా గోవాకు చేరుకోవచ్చు.