‘సనాతన ధర్మం’ పై ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం

‘సనాతన ధర్మం’ పై ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం
‘సనాతన ధర్మం’ పై ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘సనాతన ధర్మం’ వైరస్‌ లాంటిదని, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తవిస్తూ, గురువారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వారే తుడిచిపెట్టుకుపోతారని పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఉద్దేశించి  హెచ్చరించారు. దీనిపై స్టాలిన్ ను శుక్రవారం విలేకరులు ప్రశ్నించగా ఆయన నవ్వుతూ ‘వెయిట్ అండ్ సీ.. వెయిట్ అండ్ సీ’’ అని స్పందించారు.

“సనాతన ధర్మం” మలేరియా, డెంగ్యూ లాంటిది అని గత ఏడాది తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హెచ్చరికపై ఈ విధంగా నాలుగు పదాల్లో ప్రతిస్పందించారు. కాలినడకన ఏడు కొండలు ఎక్కి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

‘‘సనాతన ధర్మం’ అనేది వైరస్ లాంటిదని మీరు అంటున్నారు. దానిని నాశనం చేస్తామని చెబుతున్నారు. ఈ మాట ఎవరు చెప్పినా.. వారికి నా సమాధానం ఒక్కటే. మీరు ‘సనాతన ధర్మాన్ని’ తుడిచిపెట్టలేరు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీరే తుడిచిపెట్టుకుపోతారు” అని కాషాయ వస్త్రాలు ధరించిన పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాను సనాతన హిందువునని, మీలాంటి వ్యక్తులు రావొచ్చు… పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. ‘‘డీఎంకే ఏ మతం గురించి, లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు. అయితే కుల దురాగతాలు, అంటరానితనం మొదలైన దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తుంది’’ తెలిపారు. “మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ లు.. వాళ్లే అసలైన శత్రువులు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన కోట్లాది మంది దృష్టిని మళ్లించే ప్రయత్నం’’ అని హఫీజుల్లా ఆరోపించారు.

‘సనాతన ధర్మం’ గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దీనిపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, నాయకులు మండిపడ్డారు. ఈ వాఖ్యాలను ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు చెన్నైలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని’ కేవలం వ్యతిరేకించలేమని, దానిని తుడిచిపెట్టేయాలని ఆయన స్పష్టం చేశారు. 

సనాతన ధర్మం ఆలోచన సహజంగానే తిరోగమనశీలమైనదని, కులం, లింగం ఆధారంగా ప్రజలను విభజిస్తుందని చెప్పారు. సమానత్వం, సామాజిక న్యాయానికి సనాతన ధర్మం అనే భావన ప్రాథమికంగా వ్యతిరేకమని స్టాలిన్ వాదించారు.

  కాగా పవన్ కళ్యాణ్‌తో పాటు ఎన్డీయే కూటమిపై డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారని అంటూ ఆక్రోశం ప్రకటించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే క్లీన్‌స్వీప్ చేసిందని పేర్కొన్నారు.

తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ హితవు చెప్పారు.