సెన్సార్ మార్పులకు ‘ఎమర్జెన్సీ’ ఆమోదం

సెన్సార్ మార్పులకు ‘ఎమర్జెన్సీ’ ఆమోదం

బాలీవుడ్ స్టార్ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ లీడ్ రోల్ లో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదలకు ఎదురవుతున్న సెన్సార్  పరమైన ఇబ్బందులు తలిగిపోయిన్నట్లయింది. ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు ఇటీవల సూచించింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, సోమవారం వాదనలు జరిగాయి. 

ఈ క్రమంలో సెన్సార్‌ బోర్డు సూచించిన కొన్ని కట్స్‌కు తాము అంగీకరిస్తున్నామని ఎమర్జెన్సీ మూవీ నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, నిర్మాణ సంస్థలను ఇటీవల ఆదేశించింది. 

దీంతో ఎమర్జెన్సీ మూవీలో కొన్ని కట్స్‌ సూచించిన బోర్డు వాటిని అంగీకరిస్తేనే సర్టిఫికెట్‌ ఇస్తామని చిత్రయూనిట్ కు తేల్చిచెప్పింది. దీనిపై నిర్మాణసంస్థ కొన్ని రోజుల సమయం కోరింది. బోర్డు సూచించిన మార్పులు చేస్తామని తాజాగా అంగీకరించింది. దీంతో తదుపరి విచారణ అక్టోబర్‌ 3కు వాయిదా పడింది. 

దీనితో ఎమర్జెన్సీ మూవీ విడుదలపై ఓ స్పష్టత వస్తుందని  భావిస్తున్నారు. కంగన స్వీయ దర్శకత్వంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. 

అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సిఉండగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాని కారణంగా వాయిదా పడింది.