
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించటం సర్వత్రా కలకలం రేపింది. దూల్ పేటలోని రాజాసింగ్ నివాసం పరిసరాల్లో నలుగురు యువకులు అనుమానస్పదంగా తిరుగుతుండటంతో గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పారిపోయారు.
ఇద్దరిని పట్టుకున్న స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరి దగ్గర గన్, బుల్లెట్స్ దొరకటంతో పాటు వారి వాట్సప్ స్టేటస్లో రాజాసింగ్ ఫొటోలు, ఆయన ఇంటి ఫొటోలు ఉండటం గమనార్హం. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న మంగళహాట్ పోలీసులు విచారిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించగా, అసలు వాళ్లు ఎందుకు రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇస్మాయిల్, మొహమ్మద్ ఖాజా బోరబండ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బోరబండ ప్రాంతంలో స్థానికంగా కొంత మందితో వారికి గొడవలు ఉన్నాయి. వాళ్లను భయపెట్టేందుకే రాజాసింగ్ ఇంటి ఫోటో తీసుకుని వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో ఆ యువకులు వెల్లడించారు.
ఆ ఫోటోలు చూసి ఎమ్మెల్యే రాజాసింగ్తో పరిచయాలు ఉన్నాయని అనుకుంటారని, తద్వారా తమ ప్రత్యర్థులు భయపడతారని, అందుకే అలా స్టేటస్లో ఆయన ఇంటి ఫొటోలు పెట్టామని యువకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, ఇద్దరు యువకులు చెప్పేది నిజమేనా? లేదా వేరే ఉద్దేశంతో అక్కడ తిరుగుతున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అయితే ఇప్పటికే చాలాసార్లు ఎమ్మెల్యే రాజాసింగ్కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయం నుంచి మొన్నటి వరకు కూడా రాజాసింగ్కు పాకిస్థాన్ లాంటి దేశాల నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాటిపై పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదులు చేశారు. ఇటీవలే డీజేల బ్యాన్ విషయంలోనూ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
డీజేలు బ్యాన్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేయగా రాజాసింగ్ మాత్రం వ్యతిరేకించటం గమనార్హం. డీజీ బ్యాన్ పేరుతో హిందూ పండగలను తొక్కి పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలా ఇద్దరు వ్యక్తులు ఆయన ఇంటిని రెక్కీ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వాళ్లు చెప్తున్న కారణాలు మాత్రం అంతగా నమ్మశక్యంగా లేకపోవటంతో, పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి