
ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. భారత్ ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి.
తాజాగా ఈ జాబితాలోకి యూకే కూడా వచ్చి చేరింది. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ యూఎన్ఎస్సీలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు.
‘భద్రతా మండలిలో తగినన్ని సభ్యదేశాలు లేనంతవరకూ ప్రతిపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగడం కష్టం. కాబట్టి భద్రతామండలిని మరింత పటిష్టం చేయాలి. ఇందులో భాగంగానే శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను పెంచాలి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి’ అని పిలుపిచ్చారు. అంతకుముందు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రన్ స్పందించారు. జనరల్ అసెంబ్లీలో మెక్రాన్ ప్రసంగిస్తూ.. యూఎన్ఎస్సీ విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని మెక్రాన్ అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో భారత్కు మద్దతు ప్రకటించారు. యూఎన్ఎస్సీ సమర్థతను పునరుద్ధరించడానికి ఈ మార్పులు తగినవి అని పేర్కొన్నారు.
ఇక గత వారం ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించింది. ఇక అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం గతంలోనే భారత్కు మద్దతు ప్రకటించారు. కాగా, భద్రతా మండలిలో భారత్కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.
ఈ ఐదు దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఐదింటిలో నాలుగు మద్దతు ఇస్తున్నా చైనా మాత్రం భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతోంది.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’