బల్దియా పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్‌పై నిషేధం

బల్దియా పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్‌పై నిషేధం

గ్రేటర్ హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా చేసేందుకు బల్దియా పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్‌పై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై వాల్ పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్ చేయడాన్ని నిషేధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా ఉంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమ్రపాలి ప్రకటించారు. 

ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వాల్ పోస్టర్స్ అంటించడం, వాల్ రైటింగ్ లాంటివి చేస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చడమే కాకుండా  వరదలు, ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తులు జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ఇప్పటికే హైడ్రా పేరుతో నగరం పరిధిలోని చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుండగా, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు.

మూసీ పరివాహక నిర్వాసితులకు రూ. 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 14 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని ప్రకటించారు. 

పిల్లగుడిసెల నుండి బాచుపల్లి వరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ బాధ్యతలను నలుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల అప్పగించారు. రెవెన్యూ శాఖ, ఎంఆర్డిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని దాన కిషోర్ తెలిపారు.