తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రొడెక్ట్స్ లిమిటెడ్పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఏడాది మే 15న నెయ్యి సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చామని, జూన్ 12, 20, 25 తేదీలతో పాటు జులై 6, 12న 4 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిందని వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వరుసగా ఫిర్యాదులు రావడంతో అనుమానంతో ఎన్డీబీఎల్ సహకారంతో అడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించామని టిటిడి తెలిపింది.
ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టుగా గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. ఆ పరీక్షల్లో లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులు వచ్చాయని పేర్కొన్నారు.
ఎన్డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని, తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు. అది చూసి తీవ్రంగా కలత చెందినట్లు చెప్పారు. దిట్టం అనుసరించి చేసే స్వామివారి లడ్డూ ప్రసాదాల తయారీలో నెయ్యి కీలకమని, అది నాణ్యంగా లేకపోతే కోట్ల మంది భక్తుల ఆరోగ్యంతో పాటు, మతపరమైన మనోభావాలు, విశ్వాసాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఏఆర్ ఫుడ్స్ సంస్థ నాణ్యత నిబంధనల్ని అనుసరించి మంచి నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్లు తెలిపారు.
కానీ, దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని నమూనా పరీక్షల్లో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఏఆర్ డెయిరీ ఫుడ్స్కి జులై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు. 28న రిజాయిండర్ నోటీసు పంపింనట్లు తెలిపారు. దీనిపై ఆ సంస్థ జులై 28, సెప్టెంబరు 4న వివరణ ఇస్తూ తాము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని తెలిపిందని వివరించారు.
కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభిప్రాయపడ్డారు. కొందరు స్వార్థశక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయటపెట్టాలని కోరారు. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థపై పోలీసులు ఆహార భద్రతా చట్టంలోని 51, 59 సెక్షన్లతోపాటు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు