భారత్ భూభాగాన్ని ‘పాకిస్థాన్‌’‌తో పోల్చడం సరికాదు

భారత్ భూభాగాన్ని ‘పాకిస్థాన్‌’‌తో పోల్చడం సరికాదు

భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదని, అది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్దమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీషానంద అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించి సుమోటో ప్రొసీడింగ్స్‌ను విరమించుకుంటూ సీజేఐ నేతృత్వంలోని ఐదు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.

ఈ వివాదంపై న్యాయమూర్తి బహిరంగ క్షమాపణ చెప్పడంతో కేసును మూసివేస్తున్నట్లు విస్తృత ధర్మాసనం పేర్కొంది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శ్రీషానంద విచారణ చేపట్టారు. 
 
ముస్లిం జనాభా అధికంగా ఉండే బెంగళూరులోని ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఈ కేసులో వాదనలు వినిపించి మహిళా న్యాయవాదిపైనా అభ్యంతరకరమైన భాషను వాడారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. 
 
దానితో కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది.  సుమోటాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ‘భారత్‌లోని ఏ భూభాగాన్ని ‘పాకిస్థాన్‌’తో పోల్చరారు.. ఇది ప్రాథమికంగా దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం అని స్పష్టం చేసింది. 
 
`సూర్యరశ్మికి సమాధానం ఎక్కువ సూర్యకాంతి.. కోర్టులో ఏమి జరుగుతుందో అణచివేయడం కాదు. దాన్ని మూసివేయడం సమాధానం కాదు’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘నిర్దిష్ట లింగం లేదా కమ్యూనిటీపై సాధారణ పరిశీలన వ్యక్తిగత పక్షపాతాన్ని సూచిస్తుంది.. కాబట్టి పితృస్వామ్య లేదా స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని ధర్మాసనం నొక్కి చెప్పింది. కోర్టు హాలులో కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఆశించిన రీతికి అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 
 
నగరంలోని సంబంధిత ఏరియా పాకిస్థాన్‌లా మారిపోయిందంటూ ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ జస్టిస్ శ్రీషానంద చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.