జెత్వానీ కేసులో నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

జెత్వానీ కేసులో నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు
ముంబయి నటి కాదంబరి జేత్వాని అక్రమ నిర్బంధం, చిత్రహింసలు కేసులో  వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేసిన ఈ కేసులో ఏ1 నిందితుడిగా అతనిని చేర్చడంతో పాటు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. ఈ కేసులో నిందితులుగా పలువురు ఐపీఎస్‌ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. 
 
ఏ2గా అప్పటి ఇంటెలిజెన్స్ అధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఏ3గా అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్‌ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా అప్పటి డిసిపి విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు. ముంబయి నటిని వేధించిన కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లు, ఏసీపీ, సీఐను సస్పెండ్ చేసింది.

వైసీపీ నేత విద్యాసాగర్‌తో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ కుమ్మక్కై పథకం ప్రకారం ముంబయి నటి జెత్వానీ వేధించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నటి జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారని బెయిల్ దొరక్కుండా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ కేసు తెరపైకి వచ్చిన్నప్పటి నుండి పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్న కుక్కల విద్యాసాగర్‌ కోసం రెండు ప్రత్యేక పొలిసు బృందాలు గాలిస్తున్నాయి. చివరకు పోలీసులు డెహ్రాడూన్‌ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో ఆదివారం అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

అక్కడి నుంచి సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించడంతో విద్యాసాగర్ ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోని మిగతా నిందితులకూ అరెస్ట్ భయం వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే దర్యాప్తునకు కాంతిరాణా సహరించాలని స్పష్టం చేసింది.

తప్పుడు కేసు నమోదు చేసి తనను వేధించినట్లు ముంబయి నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సెప్టెంబర్ 13న కేసు నమోదు చేసిన పోలీసు.. దర్యాప్తు చేపట్టారు. కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసుల పేర్లు నటి జెత్వానీ ఫిర్యాదులో పేర్కొంది.