అక్టోబర్‌ 16న విచారణకు రావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం

అక్టోబర్‌ 16న విచారణకు రావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం

ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో అక్టోబర్​ 16న విచారణకు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు నిందితుడు మత్తయ్య జెరూసలేం హాజరు కాగా రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు.

నిందితులు ఎందుకు హాజరు కావడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ దశలో ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను అనుమతించిన కోర్టు, అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16 హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు నిందితులందరినీ ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ సీనియర్​ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటీషన్​ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును భోపాల్‌కు బదిలీ​ చేయాల్సిన అవసరం లేదని, ఊహాజనితమైన అంశాలతో స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్‌ వేశారని న్యాయస్థానం పేర్కొంది.

ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణ కొనసాగిస్తున్న నాంపల్లి న్యాయస్థానం మాత్రం తదుపరి విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించడం సంచలనంగా మారింది.  2015లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్​ను టీడీపీకి మద్ధతుగా వ్యవహరించమని డబ్బు ఆశచూపిన ఆరోపణలపై అప్పటి టీడీపీ శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

స్టీఫెన్‌ సన్‌ ఇంట్లో రేవంత్‌ రెడ్డి డబ్బు సంచులతో ఉన్నట్లు ఉన్న వీడియోలు అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీంతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ దీనిపై సుదీర్ఘంగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది.