ఆస్కార్‌కు కిరణ్‌ రావు ‘లాపతా లేడీస్‌’

ఆస్కార్‌కు కిరణ్‌ రావు ‘లాపతా లేడీస్‌’
ఆమీర్‌ ఖాన్‌ ప్రోడ‌క్షన్‌లో, ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 2025 ఆస్కార్‌ కు మన దేశం నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా వెల్లడించింది.

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్‌ ఖాన్‌ ప్రోడ‌క్షన్‌లో వ‌చ్చిన చిత్రం ‘లాపతా లేడీస్’. ఆయన మాజీ భార్య కిర‌ణ్ రావ్ ) ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించింది. జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా న‌టించ‌గా.. భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ కీల‌క పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 

ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నది. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా  కోర్టు అడ్మినిస్ట్రేట్‌ వేడుకల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది.  ఇది కాకుండా ‘ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)’ అవార్డుల్లోనూ లాపతా లేడీస్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో బెస్ట్‌ ఫిల్మ్‌గా అవార్డు అందుకుంది.

రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌రావు మాట్లాడుతూ.. తమ చిత్రం ఆస్కార్‌ వేదికపై మనదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తనతోపాటు చిత్ర బృందం కోరికని వెల్లడించారు.  ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా తనవంతు బాధ్యతగా ఆస్కార్‌కు పంపిస్తుందనే నమ్మకం ఉన్నదనీ చెప్పుకొచ్చింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన కిరణ్‌రావు.. 2011లో అమీర్‌ఖాన్‌ హీరోగా ‘ధోభీ ఘాట్‌’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. ఆ తర్వాత  ‘లాపతా లేడీస్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.  పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్లే సమయంలో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైపోతారు.  ఇది తెలియని పెళ్లికొడుకులు ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్తారు. తీరా చూసుకున్నాక అసలు నిజం బయటపడుతుంది. అయితే ఈ మార్పు వల్ల ఆ ఇద్దరి అమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే మిగతా కథ.