కాగా, శనివారం లడ్డూ అపవిత్రంపై టీటీడీ ఈవో శ్యామలరావు అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, అర్చకులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆగమ సలహా మండలి సభ్యులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ పండితులు మోహనరంగాచార్యులు, సీతారామాచార్యులు, పలువురు అర్చకులు పాల్గొన్నారు.
ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలనే ఆభిప్రాయాలు వస్తున్నాయని, దీనిపై ఆగమశాస్త్రంలో ఎలాంటి చర్యలు చేపట్టాలని ఉందనే అంశాలపై చర్చించారు. నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో పరిహారం కింద ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈవో ప్రశ్నించారు. ఆగమ సలహా మండలి సభ్యులు స్పందిస్తూ.. అనుమానాలు తలెత్తిన క్రమంలో శుద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఆగమ సలహా మండలి సభ్యులతో పాటు ఇతర ప్రధాన అర్చకులు, అర్చకులు, సీనియర్ పండితులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నంలోగా శుద్ధి నిర్వహణపై పూర్తిస్థాయి ప్రణాళిక ఇవ్వాలని ఈవో కోరారు.
లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎం చంద్రబాబుకి టీటీటీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. మరింత సమాచారాన్ని టీటీడీ అధికారులు ఆదివారం అందజేయనున్నారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. తిరుమల పవిత్ర కాపాడే విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు.

More Stories
విజయవంతంగా ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం
విజయవాడలో ఆకట్టుకున్న ‘భువన విజయము’ సాహిత్య రూపకం
వైసీపీలో నంబర్ 1గా సజ్జల, నంబర్ 2గా జగన్!