నేరం అంగీకరించిన జానీ మాస్టర్?

నేరం అంగీకరించిన జానీ మాస్టర్?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహరం అటు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసుసు శుక్రవారం  ఉప్పరపల్లి కోర్టులో పెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో.. జానీ మాస్టర్‌ను చంచల్ గూడా జైలుకు తరలించారు. 
 
అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలోనే ఉండనున్నారు. కోర్టులో హాజరు పర్చిన సమయంలో జానీ మాస్టర్‌పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు సమక్షంలో జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
 
 2019లోనే బాధితురాలితో జానీ మాస్టర్‌కు పరిచయమైందని తెలిపారు. అయితే.. దురుద్దేశంతోనే  ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్టు వెల్లడించారు. కాగా 2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో బాధితురాలిపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఇక అప్పటి నుంచి ఈ నాలుగేళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పేర్కొన్నారు.   విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించినట్టు రిమాండ్ రిపోర్టులో వివరించారు. జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య అయేషా అలియాస్ సుమలత కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
 
తనపై జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు షేక్ జానీ బాషాపై  ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు చేశారు.
 
కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ గాలించారు. చివరకు గోవాలో తలదాచుకున్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పర్ పల్లి కోర్టు ముందు హాజరు పరిచారు.