ఫేక్‌ న్యూస్‌ను గుర్తించే ఫ్యాక్ట్‌ చెక్‌ లకు హైకోర్టు చెక్

ఫేక్‌ న్యూస్‌ను గుర్తించే ఫ్యాక్ట్‌ చెక్‌ లకు హైకోర్టు చెక్
ఆన్‌లైన్‌లో వచ్చే ఫేక్‌ న్యూస్‌ను గుర్తించేందుకు ఫ్యాక్ట్‌ చెక్‌ (నిజ నిర్ధారణ) యూనిట్‌లను ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి బొంబాయి హైకోర్టు చెక్‌ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టానికి చేసిన సవరణలను కొట్టివేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 19కి విరుద్ధమని జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌ శుక్రవారం తీర్పునిచ్చారు.

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సవరణ నిబంధనలు, 2023 ప్రకారం ఆన్‌లైన్‌లో వచ్చే బోగస్‌ న్యూస్‌ను గుర్తించేందుకు కేంద్రం నిజ నిర్ధారణ యూనిట్‌లను ఏర్పాటు చేయవచ్చు. ఈ అంశాన్ని అత్యంత క్షుణ్ణంగా పరిశీలించానని, ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు ఆర్టికల్‌ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్‌ 19 (భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం), ఆర్టికల్‌ 19 (1)(జీ) (వృత్తి స్వేచ్ఛ, హక్కు)లను ఉల్లంఘించేవిగా ఉన్నాయని జస్టిస్‌ చందూర్కర్‌ పేర్కొన్నారు.

ఐటీ నిబంధనల్లోని ‘బోగస్‌, తప్పుడు, తప్పుదోవ పట్టించే’ అనే మాటలకు ఎటువంటి నిర్వచనం లేని నేపథ్యంలో అవి అస్పష్టంగాను, తప్పుగాను ఉన్నాయని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన బొంబాయి హైకోర్టు ధర్మాసనం ఈ ఏడాది జనవరిలో భిన్నమైన తీర్పునిచ్చింది. దీంతో కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వచ్చింది.

ఐటీ చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ప్రతిపాదించిన నిబంధనలు వార్తలపై సెన్సార్‌ విధించేలా ఉన్నాయని జస్టిస్‌ పటేల్‌ పేర్కొనగా, ఆ నిబంధనల వల్ల వాక్‌ స్వాతంత్య్రానికి వచ్చిన నష్టమేమీ లేదని జస్టిస్‌ గోఖలే చెప్పారు. దీంతో జస్టిస్‌ చందూర్కర్‌ వచ్చిన ఈ కేసులో ఆయన శుకవారం తుది తీర్పునిచ్చారు.

కేంద్రం ప్రతిపాదించిన నిబంధనల వల్ల భావప్రకటనా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రంపై అకారణంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని కమెడియన్‌ కునాల్‌ కామ్రాతోపాటు మరికొందరు పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ వార్తలపై ప్రభుత్వం సెన్సార్‌ విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌ వార్తలకు ప్రభుత్వమే ‘ప్రాసిక్యూటర్‌గా, జడ్జిగా, తీర్పును అమలుచేసే అధికారి’గా వ్యవహరించే అధికారం ఈ నిబంధనల వల్ల లభిస్తుందని పేర్కొన్నారు.