“ఎమర్జెన్సీ”కి సెన్సార్‌ జాప్యంపై హైకోర్టు అసహనం

“ఎమర్జెన్సీ”కి సెన్సార్‌ జాప్యంపై హైకోర్టు అసహనం
బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌ నటించి తెరకెక్కించిన మూవీ ఎమర్జెన్సీ. ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నది. వాస్తవానికి ఇప్పటికే మూవీ విడుదల కావాల్సి ఉండగా సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ జారీ చేయడంలో ఆలస్యం కావడంతో వాయిదాపడింది. తాజాగా ఎమర్జెనీ మూవీ టీమ్‌కి బాంబే హైకోర్టులో ఊరట కలిగింది. 

బాంబే హైకోర్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ని మందలించింది. సృజనాత్మకత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. శాంతిభద్రతలకు ముప్పు ఉందనే కారణంతో సెన్సార్‌ బోర్డు సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఘాటు స్పందించింది. ఎమర్జెన్సీకి సర్టిఫికెట్ జారీ చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జస్టిస్ బీపీ కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ దేశ ప్రజలు సినిమాలో చూపించే ప్రతిదాన్ని నమ్మేంత అమాయకులని సీబీఎఫ్‌సీ భావిస్తుందా? అని సీబీఎఫ్‌సీని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో సినిమాకు సర్టిఫికెట్‌ జారీ చేయడంలో సీబీఎఫ్‌సీ జాప్యం చేస్తోందన్న పిటిషనర్‌ వాదనలపై.. చిత్ర సహ నిర్మాత కంగనా రనౌత్‌ స్వయంగా బీజేపీ ఎంపీ అని కోర్టు గుర్తు చేసింది.

అధికార పార్టీ సొంత ఎంపీకి వ్యతిరేకంగా పని చేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ పాత్రను పోషించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా కంగనా వ్యవహరించింది. వాస్తవానికి ఎమర్జెన్సీ మూవీకి సర్టిఫికెట్‌ జారీ చేసేలా సీబీఎఫ్‌సీని ఆదేశించాలంటూ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. 

సెప్టెంబర్‌ 6న మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. శిరోమణి అకాలీదళ్‌ సహా పలు సిక్కు సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు.