గగన్‌యాన్‌, శుక్రయాన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

గగన్‌యాన్‌, శుక్రయాన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పంపిన ప్రతిపాదలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. చంద్రయాన్‌-4 మిషన్‌, గగన్‌యాన్‌, వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, ఎన్‌జీఎల్‌ఏ వాహకనౌక ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు నిధులు సైతం కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. 
 
సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేబినెట్‌ చంద్రయాన్‌-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇస్రో 2026 నాటికి చేపట్టాలని భావిస్తున్నది. 
 
ఇందుకోసం రూ.2,104.06 కోట్లు కేటాయించారు. భారత వ్యోమగాములను చంద్రునిపై దించడం, వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టనున్నారు. రెండు దశల్లో చంద్రయాన్‌-4 మిషన్‌ను నిర్వహిస్తుంది.  రెండు దశల్లో భాగాలను నింగిలోకి పంపి.. ఆ తర్వాత స్పేస్‌లోనే కనెక్ట్‌ చేయనున్నారు. 
 
ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా, రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నారు. మిషన్‌లో భాగంగా చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించి.. తిరిగి భూమిపైకి చేరుకుంటుంది. ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్‌ చరిత్ర లిఖించనున్నది.  ఇక భారత్‌ గగన్‌ యాన్‌ ప్రాజెక్టును సైతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఇందులో భాగంగా వ్యోమగాములను నింగిలోకి పంపేందుకు ప్లాన్‌ చేస్తున్నది. ఇందు కోసం వ్యోమగాములను సైతం ఎంపిక చేసిన శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. 
 
దాంతో పాటు వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌కు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం శుక్రుడు (వీనస్‌). కానీ ఈ గ్రహాల వాతావరణాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపకరిస్తుంది. . ఇందులో వీనస్‌ వాతావరణంపై పరిశోధనలు జరుపనున్నది.  ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం కేబినెట్‌ రూ.1,236 కోట్లు కేటాయించింది. అందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ అభివృద్ధి చేయనుంది ఇస్రో.
 
అలాగే, తర్వాతి తరం లాంచ్‌ వెహికల్‌కు సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  30 టన్నుల బరువైన పేలోడ్లను దిగువ భూ కక్షలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన నెక్ట్స్‌ జనరేషన్‌ లాంఛ్‌ వెహికిల్- ఎన్‌జీఎల్‌ఏని అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.