రోగి సినిమా చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు

రోగి సినిమా చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు
 కాకినాడలోని జనరల్ హాస్పిటల్ లో మంగళవారం మధ్యాహ్నం, ఓ మహిళా ర్పగో చేతిలో ట్యాబ్‌ లో తనకు ఇష్టమైన ‘అదుర్స్‌’ సినిమాలోని జూనియర్‌ ఎన్టీఆర్, బ్రహ్మానందం నడుమ నడిచే హాస్య సన్నివేశాలను చూస్తుండగా, వైద్యులు ఆమెకు మెదడులో శస్త్రచికిత్స చేశారు. ఆమె మెదడులో ఏర్పడిన కణితి తొలగింపు శస్త్రచికిత్స ద్వారా ఆమె మెలకువలో ఉండగానే తొలగించారు.

కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ డిపార్ట్​మెంట్​ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ.అనంతలక్ష్మి (55)కి కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి తీవ్రంగా లాగుతుంది. ఆమెను పలు కార్పొరేట్​ ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యం ఖర్చుతో కూడినదని, నయం కావడం కష్టమని ఆయా చోట్ల డాక్టర్లు తెలిపారు. 

 
ఈనెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా అనంతలక్ష్మిని కాకినాడలోని జీజీహెచ్‌లో చేర్పించారు.
వైద్యులు పరీక్షించి అనంతలక్ష్మి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 
 
మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా దానిని తొలగించారు. ‘అదుర్స్‌’ మూవీ చూపిస్తూ అనంతలక్ష్మి ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఆమె లేచి కుర్చున్నారని, టిఫిన్​ తీసుకున్నారని వైద్యులు తెలిపారు. 
జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని చెప్పారు. మరో ఐదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జ్ చేస్తామని పేర్కొన్నారు.
దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్‌ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రీట్​మెంట్​ సాగిందని వైద్యులు వివరించారు.
శస్త్రచికిత్స సమయంలో వైద్యులు అడిగే ప్రశ్నలకు సాధారణంగా రోగులు సమాధానాలు చెబుతారు. తద్వారా వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చని జీజీహెచ్‌ అనస్తీషియా హెచ్‌వోడీ డా.ఎ.విష్ణువర్థన్, న్యూరోసర్జరీ విభాగం అధిపతి డా.విజయశేఖర్‌ వివరించారు.