జీహెచ్ఎంసీ ప‌రిధిలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి ఏర్పాట్లు పూర్తి

జీహెచ్ఎంసీ ప‌రిధిలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి ఏర్పాట్లు పూర్తి
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ అమ్ర‌పాలి తెలిపారు. న‌గ‌రంలో గణేశ్ నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను డీజీపీ జితేంద‌ర్, సీపీ సీవీ ఆనంద్‌తో క‌లిసి అమ్ర‌పాలి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అమ్ర‌పాలి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 73 పాండ్స్‌, 5 పెద్ద చెరువుల వద్ద నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. 

73 పాండ్స్‌లో 27 బేబీ పాండ్స్‌, 24 ఫోర్టబుల్‌, 22 ఎస్కలేటార్‌ పాండ్స్‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అంతే కాకుండా అన్ని నిమజ్జన కేంద్రాల వద్ద త్రాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

సరూర్‌నగర్‌ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌, బహదూర్‌పురా మిరాలం చెరువు, కాప్రా ఊర చెరువులో నిమజ్జనానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం కోసం 172 రోడ్ల మరమ్మత్తులు, 36 ట్రాన్స్‌పోర్ట్‌, 140 స్టాటిక్‌ క్రేన్‌లు, 295మొబైల్‌ క్రేన్స్‌, 160 గణేష్‌ యాక్షన్‌ టీమ్స్‌, 102 మినీ టిప్పర్‌లు, 125జేసీబీలు, 308మొబైల్‌ టాయిలెట్స్‌, 52,270 తాత్కాలిక స్ట్రీట్‌లైట్స్‌ తదితర అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వివరించారు. 

అంతేకాకుండా అవసరమున్న చోట అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు క‌మిష‌న‌ర్ అమ్ర‌పాలి స్ప‌ష్టం చేశారు. నిమ‌జ్జ‌నం జ‌రిగే ప్రాంతాల్లో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్ప‌ష్టం చేశారు.  హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో 30 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఒక్క హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోనే 25 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనాన్ని ఈనెల 17 మధ్యాహ్నం 1.30 గంట‌లోపు పూర్తి చేయనున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల వరకు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్ల‌నున్నట్లు తెలిపారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామ‌ని చెప్పారు.