కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం

కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం

ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 

ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని ఆమె స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని చెబుతూ రూ.  2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసిందని ఆమె తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూ. 20వేల కోట్లు డీపీఆర్ ఓకే చేశారని తెలిపారు. 

ఇంటర్నల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారని, అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె వివరించారు. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదని.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదని పురందేశ్వరి విమర్శించారు. చంద్రబాబుకు లేఖ రాశారని.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని ఆమె చెప్పారు.

పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నం అయ్యాయన్నాని పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. నిర్మాణం అయిన డయా ఫ్రం వాల్ దెబ్బ తినడం బాధాకరమని ఆమె చెప్పారు. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదని.. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి రూ. 990కోట్లు కేంద్రం ఇస్తుందని ఆమె చెప్పారు. 

ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించిందని చెబుతూ  కూటమి ప్రభుత్వం సారధ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయమని పురందేశ్వరి స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానమన్నారు. ప్రధాని మోదీ  సారధ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారని చెబుతూ 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారని పురందేశ్వరి పేర్కొన్నారు.