ఆరు దేశాల్లోని వాట్సాప్‌ పై నిషేధం

ఆరు దేశాల్లోని వాట్సాప్‌ పై నిషేధం

వాట్సాప్‌ ను  ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ 53 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల్లోని ప్రభుత్వాలు మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ని నిషేధించాయి. 

భారత్‌కు పొరుగుదేశమైన చైనాతో పాటు ఇరాన్‌, యూఏఈ, ఖతార్‌, సిరియా, ఉత్తర కొరియా దేశాల్లో వాట్సాప్ వాడకాన్ని నిషేధించాయి.  వాట్సాప్‌ని బ్యాన్‌ చేసిన దేశాల్లో ఉత్తర కొరియా ఒక్కటి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్‌ విధానాలు ఇక్కడ అమలులో ఉన్నాయి. ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలకు ఇంటర్‌నెట్‌ వినియోగం పరిమితంగా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కమ్యూనికేషన్‌పై నియంత్రణను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్‌ సహా పలు యాప్‌ని వినియోగించకుండా నిషేధం విధించారు. తద్వారా స్థానిక సమాచారాన్ని బయటకు వెల్లడికాకుండా సమాచార వ్యాప్తిని అడ్డుకట్ట వేసేలా కిమ్‌ వాట్సాప్‌ని బ్యాన్‌ చేశారు.

 చైనాలో ఇంటర్‌నెట్‌ వినియోగంపై ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుంది. చైనీస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్రేట్ ఫైర్‌వాల్ పౌరులు బయటి ప్రపంచానికి సంబంధించిన అనేక విదేశీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. విదేశీ యాప్‌లకు బదులుగా వుయ్‌చాట్‌ తదితర స్వదేశీ యాప్‌లను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం సమగ్ర వ్యూహంపై పని చేస్తుంది. కమ్యూనికేషన్‌ నియంత్రించడంలో భాగంగా వాట్సాప్‌ని నిషేధించింది.

సిరియా చాలా కాలంగా అంతర్యుద్ధంతో పోరాడుతోంది. పైగా సిరియాపై అనేక ఆంక్షలు విధించారు. దీని కారణంగా సిరియాలో వాట్సాప్ నిషేధించబడింది. దేశంలో జరిగే విషయాలు బయటికి చేరడం ఇక్కడి ప్రభుత్వానికి సైతం ఇష్టం లేదు. అదే సమయంలో సమగ్ర ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ విధానంలో ఓ భాగంగా వాట్సాప్ నిషేధం కూడా భాగమే.

ఇరాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. అణుబాంబు విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తోంది. దీని కారణంగా వాట్సాప్ ఇరాన్‌లో ఎప్పటికప్పుడు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ అశాంతి దృష్ట్యా కమ్యూనికేషన్, సమాచార వ్యాప్తిని నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం వాట్సాప్‌ను కూడా నిషేధించింది.

ఖతార్ ప్రభుత్వం వాట్సాప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్స్‌ని బ్లాక్‌ చేసింది. కేవలం టెక్స్‌ట్‌ సందేశాలు పంపుకునేందుకు మాత్రమే అవకాశం ఉన్నది. ఖతార్ ప్రభుత్వం తన టెలికాం కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు కాల్స్‌పై నిషేధం విధించింది. ఇటీవలి కాలంలో యూఏఈలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఖతార్ ప్రభుత్వం తరహాలోనే వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్స్‌ను బ్లాక్‌ చేసింది. యూఏఈలో టెక్స్‌ట్‌ మెసేజింగ్‌పై ఎలాంటి నిషేధాజ్ఞలు లేవు.