
బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క్రిమినల్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉండటం ఆ నిందితుల ఇండ్ల కూల్చివేతకు తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది.
ఇటువంటి చర్యలను దేశ చట్టాలను తుంగలో తొక్కడంగా పరిగణించవచ్చునని హెచ్చరించింది. గుజరాత్లోని ఖేదా జిల్లాకు చెందిన జావేద్ అలీ మెహబూబామియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఈ హెచ్చరిక చేసింది.
సయీద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కఠ్లాల్ గ్రామ రెవిన్యూ రికార్డుల ప్రకారం తన క్లయింటు ఓ భూమికి సహ యజమాని అని చెప్పారు. ఆ భూమిలో ఇంటిని నిర్మించుకోవడానికి గ్రామ పంచాయతీ 2004లో అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల నుంచి మూడు తరాలు ఆ ఇంటిలో నివసిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఈ నెల 2న జారీ చేసిన ఇండ్ల కూల్చివేత కోసం అనుసరించవలసిన మార్గదర్శకాలను కూడా ప్రస్తావించారు.
ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పందిస్తూ, ప్రభుత్వాల చర్యలు చట్టాలకు అనుగుణంగా ఉండవలసిన దేశంలో, ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండటాన్ని కారణంగా చూపించి, ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తులకు, వారు చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇంటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
నేరంలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఆ నిందితుని ఇంటిని కూల్చివేయడానికి తగిన కారణం కాబోవని వివరించింది. సయీద్పై కేసు న్యాయస్థానంలో రుజువు కావలసి ఉందని తెలిపింది. చట్టమే సర్వోన్నతమైన దేశంలో ఇటువంటి కూల్చివేత బెదిరింపులను చూసీచూడనట్లు కోర్టు ఉండటం సాధ్యం కాదని చెప్పింది.
ఇటువంటి చర్యలను చట్టాలపైకి బుల్డోజర్లను తోలడంగా పరిగణించవచ్చునని తెలిపింది. సయీద్ పిటిషన్పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సయీద్ ఇంటిని కూల్చవద్దని ఆదేశించింది.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!