కార్గిల్ యుద్ధం చేసింది మేమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ సైన్యం

కార్గిల్ యుద్ధం చేసింది మేమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ సైన్యం
భారత్‌ పాక్ మధ్య జరిగిన భీకర యుద్ధాల్లో కార్గిల్ యుద్ధం ఒకటి. ఈ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికీ 25 ఏళ్లు దాటినా పాకిస్తాన్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఇప్పటివరకు కార్గిల్‌ యుద్ధంలో తాము పాల్గొనలేదని బుకాయిస్తూ వచ్చిన పాక్‌ సైన్యం ఎట్టకేలకు దాన్ని అంగీకరించింది.
 
దొంగ దారిన భారత్‌లోకి చొచ్చుకువచ్చి.. మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్‌ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. భారత సైన్యం కొట్టిన దెబ్బకు తోక ముడుచుకుని వెనక్కి తిరిగి పారిపోయింది. అయితే యుద్ధంలో చావుదెబ్బ తిన్న పాక్ అవమానంతో యుద్ధం చేసింది తాము కాదంటూ ఇన్నేళ్లపాటు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. 
 
కానీ తాజాగా ఆ దేశ సైన్యాధిపతి బహిరంగంగా కార్గిల్ యుద్ధం చేసింది తామే అంటూ చెప్పడం సంచలనంగా మారింది. పాకిస్తాన్‌ రావల్పిండిలోని ఆ దేశ ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో శుక్రవారం డిఫెన్స్‌ డే కార్యక్రమం సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 
 
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్‌ యుద్ధాల్లో వేలాది మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని ఆసిమ్ మునీర్ పేర్కొన్నారు. దీంతో కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ సైన్యం పాలుపంచుకుందని అంగీకరించినట్లు అయింది.  1999 మే- జులై మధ్య భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది.
ముజాహిదీన్‌ ఉగ్రవాదుల ముసుగులో భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత భూభాగాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి.  ఈ క్రమంలోనే అలర్ట్ అయిన భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టింది. భారత సైన్యం చేస్తున్న ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్‌ దెబ్బకు భయపడి పారిపోయింది.
జులై 26వ తేదీన పాక్‌ సైన్యాన్ని తరిమికొట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. అప్పట్నుంచి ఏటా ఆ రోజున కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను భారత్ నిర్వహిస్తోంది.
అయితే కార్గిల్ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్‌ బుకాయింపులు చేస్తోంది. ముజాహిదీన్‌లు లేదా కాశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడి ఉంటారని ఆరోపణలు చేసింది. తాము ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ మాత్రమే చేశామని పాక్ చెప్పింది. కానీ పాక్ బుకాయింపులను నమ్మని భారత్‌ వాటి ఆరోపణలను ఖండించింది. 
 
అంతేకాకుండా కార్గిల్ యుద్ధంలో పాక్‌ సైన్యం పాత్రకు సంబంధించి కీలక ఆధారాలను బయటపెట్టింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్‌ పర్వేజ్ ముషారఫ్‌, ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ అజీజ్‌లు రావల్పిండిలో మాట్లాడుకున్న ఫోన్‌ సంభాషణలను భారత్ విడుదల చేసింది. దీనిలో భారత్ పాక్ మధ్య ఎల్‌వోసీని మార్చడమే అంతిమ లక్ష్యమని ముషారఫ్‌ తన డిప్యూటీకి చెప్పినట్లు వివరాలు బయటికొచ్చాయి.
 
గతంలో పాక్‌ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్‌ యుద్ధంలో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని వెల్లడించారు. ఇక ఆ ఆపరేషన్‌కు ఫోర్‌ మ్యాన్‌ షో అని పాక్ పెట్టినట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) షాహిద్‌ అజీజ్‌ అభివర్ణించారు. అప్పటి ఆర్మీ జనరల్‌ ముషారఫ్‌తో పాటు కొందరు టాప్‌ కమాండర్లకు మాత్రమే దీని గురించి తెలుసని చెప్పారు. అయితే అప్పట్లో కార్గిల్ యుద్ధంపై స్పందించేందుకు పాక్‌ నిరాకరించింది.