సీతారాం ఏచూరి పరిస్థితి విషమం

సీతారాం ఏచూరి పరిస్థితి విషమం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. 
 
తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దవాఖాన వర్గాలు చెబుతున్నాయి.
 
72 ఏండ్ల సీతారాం ఏచూరి చాలా రోజులుగా శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ (కంటిశుక్లం) కూడా అయింది. అప్పటి నుంచి పెద్దగా బయట ఎక్కడా కనిపించట్లేదు. కాగా, ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ఆగస్టు 31న సీపీఎం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కామ్రేడ్‌ సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని అందులో పేర్కొంది.

సీతారాం ఏచూరి ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌చ్చిన మీడియా క‌థ‌నాల‌పై సీపీఎం స్పందించింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా సీపీఎం ధృవీక‌రించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సీపీఎం కేంద్ర క‌మిటీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏచూరి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నార‌ని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. చికిత్సకు సానుకూల స్పందిస్తున్నార‌ని, ఏచూరి ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. వైద్యానికి ఆయ‌న స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఆయ‌నఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.