భారత్‌ స్వయంగా అనేక ‘సింగ్‌పూర్‌’లను సృష్టిస్తోంది

భారత్‌ స్వయంగా అనేక ‘సింగ్‌పూర్‌’లను సృష్టిస్తోంది
భారత్‌ స్వయంగా అనేక ‘సింగ్‌పూర్‌’లను సృష్టించాలనుకుంటోంని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్‌ ఓ నమూనా అని మోదీ పేర్కొన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో గురువారం చర్చలు జరిపారు. సింగపూర్​కు చెందిన వివిధ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా వారికి భారత్​లో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. విమానయానం, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా సింగపూర్ వ్యాపారవేత్తలను ప్రధాని కోరారు. ఈ నేఫథ్యంలో భారత్​లో దశలవారీగా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి.

గత 10 ఏళ్లలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని మోదీ తెలిపారు. “భారత్​లో రాజకీయ స్థిరత్వం, సులభతర వ్యాపారం. సంస్కరణ-ఆధారిత ఆర్థిక ఎజెండాల్లో మార్పులు తీసుకువచ్చాము. పెట్టుబడి నిధులు, మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, లాజిస్టిక్స్‌తో వంటి వివిధ రంగాల్లో వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది” అని ధీమా వ్యక్తం చేశారు.

విమానయాన రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లు తెలిపారు. దేశీయంగా విమానయాన రద్దీని తీర్చడానికి భారతదేశంలో సుమారు 100కు పైగా కొత్త విమానాశ్రయాలు అవసరం ఉన్నాయని వెల్లడించారు. ‘మరిన్ని ఎయిర్​లైన్ సంస్థలు భారత్​కు రావాల్సి ఉంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్ ఏదైనా ఉందంటే, అది ఇండియానే” అని ప్రధాని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాలలో సహితం పెట్టుబడులను ఆహ్వానించారు.

భారత్ లుక్​ ఈస్ట్ పాలసీకి సింగపూర్‌ను “ముఖ్యమైన ఫెసిలిటేటర్”గా అభివర్ణించిన మోదీ, “ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తి కానుంది. గత 10 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య వాణిజ్యం రెండింతలు పెరిగింది. పరస్పర పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగి 150 బిలియన్ డాలర్లను దాటింది. మేము యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని మొదట సింగపూర్​లోనే ప్రారంభించాం” అని ప్రధాని మోదీ తెలిపారు.

భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సింగపూర్ వ్యాపారుల పాత్రను మోదీ కొనియాడారు. ఇండియాలో పెడ్డుబడులు పెట్టేవారి కోసం సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇది భారత్​- సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచడం సహా ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలకును బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
సింగపూర్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నమూనాగా ప్రధాని ఆ దేశ ప్రధాని  లారెన్స్ వాంగ్‌తో తన చర్చల సందర్భంగా చెప్పారు. గత పదేళ్లలో, సింగపూర్‌కు చెందిన 17 ఉపగ్రహాలు భారత నేల నుండి ప్రయోగించమని గుర్తు చేశారు.
 
“ఈ రోజు మనం కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మా సంబంధాన్ని పెంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను,” అని ఆయన చెప్పారు. తన పర్యటన సందర్భంగా, భారతదేశం, సింగపూర్ తమ సంబంధాలను “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం”కి పెంచుకున్నాయి. నాలుగు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.